
కరెంటుషాక్ తో రైతు మృతి
ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. కుటుంబం రోడ్డునపడింది. ఆ వ్యక్తి భార్యాపిల్లలు రోడ్డునపడ్డారు.
♦ విద్యుదాఘాతంతో స్తంభంపైనే రైతు మృతి
♦ ఏళ్లు గడిచినా ఆన్ఆఫ్ సిస్టమ్ లేనివైనం
♦ పరిహారం చెల్లించేందుకు ట్రాన్స్కో హామీ
♦ షాబాద్ మండలం కేశారంలో విషాదం
షాబాద్: ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. కుటుంబం రోడ్డునపడింది. ఆ వ్యక్తి భార్యాపిల్లలు రోడ్డునపడ్డారు. విద్యుత్ సరఫరా కావడం లేదని స్తంభం ఎక్కిన రైతు కరెంట్ షాక్కు గురై స్తంభంపైనే కన్నుమూశాడు. ఘటనా స్థలంలో మృతుడి కుటుంబీకులు రోదించిన తీరు హృదయ విదారకం. ‘మేమెలా బతకాలి...’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళనకు దిగారు. చివరకు అధికారులు పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటన షాబాద్ మండలం కేశారం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
స్థానికులు, ఏఎస్ఐ శ్యాంసుందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఏండీ మునీరుద్దీన్(45) ఉదయం తన పొలానికి వెళ్లి బోరుమోటార్ ఆన్ చేశాడు. కరెంట్ సరఫరా కాకపోవడంతో దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి లైన్ బంద్ చేసి స్తంభం ఎక్కాడు. విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా కరెంట్ ప్రసారమవడంతో షాక్ తగిలి స్తంభంపైనే ప్రాణం పోయి విగతజీవిలా వేలాడాడు. కొద్దిసేపటికి అదే గ్రామానికి చెందిన రైతు నర్సింహారెడ్డి విషయం గమనించి మృతుడి కుటుంబీకులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. రెండు రోజుల క్రితం విద్యుత్ సిబ్బంది ఈ స్తంభానికి రెండు లైన్లు ఉండడంతో వాటి కలెక్షన్ తొలగించామన్నారు. కాగా వాస్తవానికి ఒకే లైన్ కనెక్షన్ను తొలగించారు.
మరో కనెక్షన్ అలాగే ఉండడంతో రైతు మునీరొద్దీన్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యాడు. ట్రాన్స్కో నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, విద్యుత్ అధికారులు వెంటనే ఇక్కడికి రావాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చేంతా వరకు మృతదేహాన్ని కిందికి దింపనివ్వమన్నారు. పదేళ్లుగా తమ గ్రామంలో విద్యుత్ ఆన్ఆఫ్ సిస్టమ్ లేదని, పలుమార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైపోయిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొద్దిసేపటికి విద్యుత్ ఏడీఏ అశోక్రావు, ఏఈ ప్రశాంత్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ. 3 లక్షలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే గ్రామంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. మృతుని కుటుంబీకులను ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి పరామర్శించి ఓదార్చారు.
ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషిచేస్తామని తెలిపారు. ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మునీరొద్దీన్కు భార్య జాహెదాబేగం, నలుగురు కుమారులు ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే మునీరొద్దీన్ మృతితో కేశారంలో విషాదం అలుముకుంది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.