గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఖజానాపై కమీషన్ల భారం పడుతోంది. అందిన కాడికి కార్పొరేషన్ సొమ్మును కమీషన్లు, పర్సంటేజీల పేర దండుకునేందుకు కొందరు సిబ్బంది పోటీ పడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం, ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఇందులో ముందు వరుసలో నిలుస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వేగం తగ్గిన కారణంగా మళ్లీ కమిషన్ల దందా జోరందుకుంది
-
– కార్పొరేషన్లో అవినీతి పాములు
-
– ప్రతీ పనికి పర్సంటేజీలు
-
– ఇంజనీరింగ్ సిబ్బంది మధ్య పోటీ
-
– ఖజానాపై అనవసరపు భారం
సాక్షి, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఖజానాపై కమీషన్ల భారం పడుతోంది. అందిన కాడికి కార్పొరేషన్ సొమ్మును కమీషన్లు, పర్సంటేజీల పేర దండుకునేందుకు కొందరు సిబ్బంది పోటీ పడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం, ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఇందులో ముందు వరుసలో నిలుస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వేగం తగ్గిన కారణంగా మళ్లీ కమిషన్ల దందా జోరందుకుంది.
జోరుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
రాష్ట్రంలో రెండో పెద్దనగరంగా పేరొందిన గ్రేటర్ వరంగల్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. ఇలా ఖర్చు పెడుతున్న సొమ్ములో పర్సంటేజీలు, కమీషన్లు పిండుకునేందుకు కొందరు సిబ్బంది అక్రమ పద్ధతులకు తెర లేపారు. అంచనాలు, అద్దెలు పెంచుకుంటూ పోవడం వారికి పరిపాటిగా మారింది. కింది స్థాయి నుంచి పైవరకు ఈ వ్యవహారంలో ఎవరి వాటా వారికి ముడుతుండడంతో చాప కిందనీరులా వ్యవహారం చక్కబెడుతున్నారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ పేరుతో చేపట్టిన నాలాలు, డ్రెయినేజీల పూడిక తీత వ్యవహరంలో చోటు చేసుకున్న కమీషన్ల వ్యవహరం అందర్ని విస్మయానికి గురి చేసిన విషయం విదితమే. మార్కెట్ ధరకు మించి వాహనాలకు అద్దె చెల్లించడం, ఇలా అధికంగా చెల్లించిన మొత్తాలను పంచుకోవడం కార్పొరేషన్లో దుమారం లేపింది. ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ వ్యవహరం బయటకు పొక్కింది. కానీ బయటకు రాకుండా చాప కింద నీరులా చక్కదిద్దిన కమీషన్ల వ్యవహరాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో కొన్నింటి వివరాలు...
– హరితహారం కార్యక్రమంలో మొక్కలు తరలించేందుకు ప్రభుత్వ వాహనాలను కాదని అద్దె ప్రతిపాదికన 10 ట్రాక్టర్లు తీసుకున్నారు. మార్కెట్ రేటు ప్రకారం ట్రాక్టరు ఒకరోజు కిరాయి సగటున రూ.1000 ఉండగా కార్పొరేషన్లో రూ.1200 చెల్లించారు. ఇదీ చాలదన్నట్లు ప్రతీ ట్రాక్టరుకు 10 లీటర్ల డీజిల్ ఉచితంగా అందించారు. ఈ వ్యవహరంలో ప్రతీరోజు ఒక్కో ట్రాక్టరుపై రూ.300 కమీషన్ చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి.
– బీరన్నకుంట – రాజీవ్ గృహకల్ప సముదాయం పైపులైను నిర్మాణ పనుల్లో పర్సంటేజీల పంచాయతీ నెలల పాటు నడిచింది. తమకు అనుకూలమైన ‘ఫిగర్’ తేలే వరకు ఇంజనీరింగ్ సిబ్బంది ఈ పనులను ముందుకు సాగనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.
– కమీషన్లు, పర్సంటేజీల విషయంలో ఇంజనీరింగ్ విభాగంలో సిబ్బంది మధ్య అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. తమ పరిధిలోకి రాని పనుల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. బొందివాగు నాలా అంశంలో ఓ డీఈ సస్పెండ్ అయ్యాడు. ఈ విభాగంలో కమీషన్లు ఇచ్చుకుంటే క్షణాల్లో బిల్లులు మంజూరవుతాయి. లేదంటే లేనిపోని కొర్రీలు పెడుతూ బిల్లుల మంజూరుకు నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. అలాగే, పర్సంటేజీల కోసం నెలల తరబడి పనులు కూడా ముందుకు సాగవు.
– ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు పెట్టే ఇబ్బందులు తాళలేక వంతుల వారీగా కాంట్రాక్టర్లు వారికి దావత్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా జరిగే పార్టీల్లో ఎవరికి ఏ పని అప్పగించాలనేది నామినేషన్లపై కేటాయింపు జరుగుతుంది.