రిమ్స్‌కు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు | another50 mbbs seats to rims | Sakshi
Sakshi News home page

రిమ్స్‌కు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు

Jul 30 2016 10:31 PM | Updated on Sep 4 2017 7:04 AM

రిమ్స్‌కు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు

రిమ్స్‌కు మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు

రిమ్స్‌లో మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించేందుకు ఎంసీఐకి ప్రతిపాదనలు పంపామని, అవి వచ్చేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

కడప అర్బన్‌ :
రిమ్స్‌లో మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించేందుకు ఎంసీఐకి ప్రతిపాదనలు పంపామని, అవి వచ్చేందుకు కృషి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం రిమ్స్‌లో ఏడు విభాగాల్లో పీజీ సీట్లు ఉన్నాయని, ఆర్థోపెడిక్, రేడియాలజీ, పిడియాట్రిక్స్‌ విభాగాల్లో పీజీలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ శనివారం ఉదయం రిమ్స్‌ ఆస్పత్రి, కళాశాల ఆవరణాల్లో పలు విభాగాలను పరిశీలించారు. ఓపీ, ఐపీ విభాగాల్లో రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. రిమ్స్‌ ఐపీ విభాగంలోని సీఎం క్యాంపు ఆఫీసు ఫర్‌ మెడికల్‌ కన్సెల్టెన్సీని ప్రారంభించారు. కళాశాలలోని విద్యార్థుల హాస్టళ్లను పరిశీలించారు. వారి మెస్‌లను తనిఖీ చేశారు. ఓపీ విభాగంలోని బయో కెమిస్ట్రీలో వివిధ అనలైజర్‌ యంత్రాలను, క్షయ నిర్ధారణను తెలియజేసే సీబీ నాట్‌ యంత్రాన్ని, డెంగీ నిర్ధారించే ఎలీజా యంత్రాన్ని ప్రారంభించారు. రిమ్స్‌లోనే రూ. 1.06 కోట్లతో నిర్మించబోయే జిల్లా బాలల భవిత కేంద్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.తర్వాత మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తన పర్యటన ముగించుకుని మీడియాతో మాట్లాడారు.  రిమ్స్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ విధానం ప్రస్తుతం 78 శాతం అమలులో ఉందని, దాన్ని వంద శాతానికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ పరీక్షలను ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా మరో వారంలో రిమ్స్‌లో ప్రవేశ పెడతామని తెలిపారు. డాక్టర్ల కొరతను అధిగమించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. డయాలసిస్‌ విభాగంలో ప్రస్తుతం 17 యూనిట్లు ఉన్నాయని, మరో 18 యూనిట్లను స్థాపించేందుకు సిద్దం చేస్తున్నామన్నారు. వీటిల్లో 10 యూనిట్లు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోనూ, ఎనిమిది కడప రిమ్స్‌ ఆస్పత్రిలో  ప్రస్తుతం ఉన్న డయాలసిస్‌ కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. దంత వైద్య కళాశాలకు ప్రత్యేకంగా కమిటీ అవసరం లేదని, రిమ్స్‌ హెచ్‌డీఎస్‌ కమిటీ వారే పర్యవేక్షించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. మంత్రి వెంట శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, అడిషనల్‌ డీఎంఈ బాబ్జి, రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శశిధర్, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌ఎంఓ డాక్టర్‌ వెంకట శివ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సత్యనారాయణరాజు, వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement