వీఆర్వో ఆత్మహత్య

VRO Commits Suicide in Srikakulam - Sakshi

ఆర్థిక లావాదేవీలే కారణమంటున్న కుటుంబ సభ్యులు

రెండేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న వీఆర్వో   

శ్రీకాకుళం రూరల్‌: ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో వీఆర్వో గా, అరిణాం అక్కివలసలో ఇన్‌చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న జె.శ్రీరాములు(35) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన స్వగ్రామం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ. శ్రీరాములు భార్య శోభారాణి ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయసు గల బాబు ఉన్నాడు. శ్రీకాకుళం సమీపంలోనే ఇద్దరికీ ఉద్యోగాలు కావడంతో నగరంలోకి క్రాంతి అపార్ట్‌మెంట్స్‌లోనే కొంతకాలంగా వీరు ఉంటున్నారు. మంచి ఉద్యోగం, చక్కటి కుటుం బంతో హాయిగా జీవిస్తున్న శ్రీరాములు ఇలా బలవణ్మరణానికి పాల్పడడం అందరికీ షాక్‌కు గురిచేసింది. శ్రీరాములు ఇటీవలే స్నేహితుల సహకారంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగారు. మొదట్లో వ్యాపారం బాగానే సాగినా ఆ తర్వాత నష్టాలు వచ్చాయి. దాని కారణంగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు..

ఆ రోజు ఏం జరిగిందంటే..?
శ్రీరాములు భార్య శోభారాణితో కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లి నూడుల్స్‌ తెచ్చుకున్నారు. సాయంత్రం 6.30 వరకూ అపార్ట్‌మెంట్‌ పరిసర ప్రాంతంలో తమ బాబును పట్టుకొని వాకింగ్‌ చేశారు. 7గంటలు సమయంలో ఇద్దరూ కలిసి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిపోయారు. తెచ్చుకున్న నూడిల్స్‌లో కొంత శ్రీరాములు తిన్నాక మిగతాది భార్యకు ఉంచారు. రాత్రి 8 గంటల సమయంలో శ్రీరాములుకు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. మాట్లాడుతూనే అతను బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. అంతసేపూ బాబుతో ఉన్న శోభారాణి కాసేపయ్యాక బెడ్‌రూమ్‌ వైపు చూడగా శ్రీరాములు ఊయలకు కట్టే తాడుతో ఉరి వేసుకుని కనిపించారు. ఈ హఠాత్పరిణామంతో శోభారాణి దిగ్భ్రాంతికి గు రయ్యారు.

ఏం చేయాలో అర్థం కాక కింద ఫ్లోర్‌ కు దిగి వాచ్‌మెన్‌కు, చుట్టుపక్కల ఉన్న వారికి విషయం చెప్పారు. అప్పటికే శ్రీరాములు కొన ఊపిరితో ఉన్నారు. వారు వచ్చి పైన తాడు కోసి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించగా ఆయన కన్ను మూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వీఆర్వో మృతితో విషాదం
ఎచ్చెర్ల క్యాంపస్‌: కుశాలపురం వీఆర్వో, అరిణాం అక్కివలస ఇన్‌చార్జి వీఆర్వో జగి లింకి శ్రీరాములు మృతితో ఎచ్చెర్ల రెవెన్యూ వర్గాల్లో విషాదం నెలకొంది. గత ఆరేళ్ల నుంచి ఈయన ఎచ్చెర్ల మండలంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు. చురుగ్గా పనిచేసే శ్రీరాములుకు అధికారుల వద్ద మంచి పేరుంది. శ్రీరాములు మృతిపై తహసీల్దార్‌ శ్రీనివాసరావుతోపాటు, రెవెన్యూ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

కేసు నమోదు
శ్రీరాములు భార్య శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. మృతదేహానికి రిమ్స్‌లోనే పోస్టుమార్టం నిర్వహించారు. రెండో పట్టణ సీఐ మల్లా మహేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ముందే అనుకున్నారా..?
శ్రీరాములు కొంతకాలంగా దిగాలుగా ఉన్నట్లు భార్య శోభారాణి తెలిపారు. ఆదివారం సాయంత్రం నూడుల్స్‌ కొనడానికి వెళ్లినప్పుడు శ్మశానాన్ని చూపిస్తూ ‘నేను మరికొద్ది రోజుల్లో ఇక్కడకు వచ్చేస్తాను’ అని అన్నారని, అప్పుడే మందలించానని ఆమె చెప్పారు. ఫ్లాట్‌కి వెళ్లినప్పటికీ బాబును ముద్దాడుతూ ‘మీ అమ్మను నువ్వే బాగా చూసుకోవాలం’టూ చెప్పారని తెలిపారు. ఇంతలోనే ఇంత ఘోరానికి పాల్పడతారని అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 కారణాలు ఏంటి..?
వాస్తవంగా భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఆర్థికంగా బాగా స్థిరపడిన వారే. ఆత్మహత్యకు పాల్పడేంత పెద్ద గొడవలేమీ వారి మధ్య లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో వచ్చిన నష్టమే ఆత్మహత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈయనతో వ్యాపారాలు చేసే పార్టనర్స్‌ ఏమైనా మోసగించారా, ఇంకేమైనా తగాదాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. రాత్రి 8 గంటల సమయంలో ఫోన్‌ వచ్చాక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కాల్‌ సారాంశం ఏమిటన్నది అంతు చిక్కాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top