రోడ్డుప్రమాదంలో అత్త, అల్లుడు దుర్మరణం

two dead in road accident - Sakshi

స్వల్పగాయాలతో బయటపడ్డ

కుమారుడు, కోడలు, మనువరాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా , నందలూరు : నందలూరు ఆల్విన్‌ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో రాజంపేట మన్నూరుకు చెందిన హబీబున్, ఆమె అల్లుడు అయూబ్‌ఖాన్‌లు దుర్మరణం చెందారు. ఆమె కుమారుడు పఠాన్‌ రఫీ, కోడలు మౌలానీ, మనవరాలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.  రాజంపేట మన్నూరుకు చెందిన హబీబున్‌ భర్త ఖాదర్‌బాషా ఇటీవల మృతి చెందాడు.  ఈ విషయం తెలుసుకుని కువైట్‌లో ఉన్న హబీబున్, ఆమె అల్లుడు ఆయూబ్‌ఖాన్‌లు ఇటీవల రాజంపేటకు వచ్చారు. ఈనెల 18వ తేదీన ఆదివారం  ఖాదర్‌బాషా కర్మకాండలు(లిల్లా) పాటూరులో నివాసం ఉంటున్న కుమారుడు పఠాన్‌ రఫీ గృహంలో నిర్వహించారు. 

కోడలు మౌలానీ గర్భిణి కావడంతో సోమవారం ఉదయం ఏపీ04–టీయూ–9193 అనే నంబరు గల ఆటోలో అత్త హబీబున్, కుమారుడు పఠాన్‌రఫీ, కోడలు మౌలానీ, మనవరాలు, అల్లుడు అయూబ్‌ఖాన్‌తో కలిసి కడపలోని ఆస్పత్రికి బయలుదేరారు. మూసివేసిన ఆల్విన్‌ కర్మాగారం సమీపంలో ఇసుకలోడుతో వస్తున్న ఏపీ04–టీఎక్స్‌–8006 నంబరుగల ట్రాక్టర్‌ ఆటోను ఢీ కొనడంతో అక్కడికక్కడే అత్త హబీబున్, అల్లుడు అయూబ్‌ఖాన్‌లు మృతిచెందారు. కుమారుడు పఠాన్‌రఫీ, కోడలు మౌలానీ, మనవరాలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అత్త, అల్లుడు ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డవారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top