యువతికి టీడీపీ నేత వేధింపులు

TDP Leader Harassment on Woman in West Godavari - Sakshi

ఏలూరు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

ఇటీవలే ఓ వివాహితపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు 

సాక్షి, పశ్చిమ గోదావరి(ఏలూరు)‌: త్వరలో పెళ్లి కావాల్సిన ఓ యువతిని ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న టీడీపీ నేతపై ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలు, యువతులపై టీడీపీ నేతల దాష్టీకాలు, దాడులు, వేధింపులు పెచ్చుమీరిపోతున్న నేపథ్యంలోనే ఏలూరుకు చెందిన టీడీపీ నేత ముసునూరి రామకృష్ణ అలియాస్‌ కిట్టు కూడా అదే బాట పట్టాడు. ఏలూరుకు చెందిన ఓ యువతికి వివాహం నిశ్చయం అయ్యింది. 

యువతి పెళ్ళి చేసుకునే కుటుంబానికి ఫోన్లు చేస్తూ ఆమె తనతో గతంలో సన్నిహితంగా ఉండేదనీ, ఆమెను పెళ్లి చేసుకోవద్దంటూ చెప్పాడు. అలాగే యువతి కుటుంబానికి సైతం ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడడంతోపాటు, పెళ్లి కాకుండా అడ్డుకుంటానని వేధింపులకు గురిచేయటంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఏలూరు డీఎస్సీ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో టూటౌన్‌ పోలీస్‌ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణపై టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్‌ 354(డీ), 506, 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితోపాటు మరికొందరికి ఈ కేసులో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు
రామకృష్ణ అలియాస్‌ కిట్టుకు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల్లోనూ రామకృష్ణ పాల్గొని హడావుడి చేస్తుంటాడు. ఏలూరులోని పలు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు బస్సులను నడుపుతుంటాడు. ఇక రామకృష్ణ స్థానిక అశోక్‌నగర్‌లో తాను ఉండే అపార్టుమెంట్‌లో పేకాటను సైతం నిర్వహిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 20 రోజుల క్రితం విజయవాడలో ఒక వివాహిత విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించగా, కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచారం. ఇటీవల జైలు నుంచి విడుదలై వచ్చిన రామకృష్ణ తన నైజం మార్చుకోకుండా అధికార దర్పంతో యువతిని వేధించాడు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top