యువకుడిపై హత్యాయత్నం | Murder Attempt on Young man In Guntur | Sakshi
Sakshi News home page

యువకుడిపై హత్యాయత్నం

Dec 8 2018 1:17 PM | Updated on Dec 8 2018 1:17 PM

Murder Attempt on Young man In Guntur - Sakshi

చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు

గుంటూరు, తెనాలిరూరల్‌: మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడిపై మరో ప్రియుడు కత్తితో హత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఆలూరు త్రివేణి భర్తతో విడిపోయి, మల్లెపాడు పరిధిలోని ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన గోపి అలియాస్‌ గాలి గోపితో కొంతకాలం సహజీవనం చేసింది. అనంతరం అతనితో విడిపోయి సుమారు ఏడాదిగా సాలిపేటకు చెందిన వెండి వస్తువుల తయారీ కార్మికుడు సూరేపల్లి శ్రీనివాసరావు అలియాస్‌ వాసుతో సహజీవనం చేస్తోంది. ద్వారకానగర్‌లోనే గది అద్దెకు తీసుకుని నివసిస్తోంది.

అవివాహితుడైన వాసు అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చి వెళుతుండే వాడు. గోపితో పరిచయాన్ని ఇటీవలి కాలంలో తిరిగి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి త్రివేణి వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు, త్రివేణి నడవడిక గురించి ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. త్రివేణి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీనివాసరావు తన స్నేహితుడు జిలానిని తోడుకు పిలిపించుకుని ఇద్దరూ కలసి త్రివేణి ఇంట్లో పడుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వీరు ఉన్న ఇంటికి వచ్చిన గోపి కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తలకు, ఎడమ బుగ్గపై తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో అడ్డుకోబోయిన జిలాని ఎడమ చేతి వేలికి గాయమైంది. శ్రీనివాసరావును ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమాచారమందుకున్న డీఎస్పీ మందపల్లి స్నేహిత, త్రీ టౌన్‌ ఎస్‌ఐ బొడ్డు అశోక్‌కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రివేణితో ఘర్షణ పడ్డాడన్న కారణంగానే వాసుపై గోపి హత్యాయత్నం చేశాడని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement