పిల్లల ముందు తల్లి అసభ్య ప్రవర్తన
బెంగళూరు : వికృత చేష్టలతో ఓ మహిళ అమ్మతనానికే తీరని కలంకం తెచ్చింది. కన్నబిడ్డల ముందు పరాయి మగవాడితో అసభ్యంగా ప్రవర్తించి పిల్లల చేతే ఛీ కొట్టించుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని అంకోలాకు చెందిన నరేష్, కమల(మార్చిన పేర్లు)కు డిసెంబర్ 1993లో వివాహమైంది. అయితే పెళ్లయిన తర్వాత నరేశ్ తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో కుంటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో వేరుకాపురం పెట్టాడు. కొద్ది కాలానికి వీరికి ఓ పాప, బాబు పుట్టారు. కొన్ని రోజుల తర్వాత నరేష్ నిద్రపోత్ను సమయంలో కమల అతడిపై కిరోసిన్ పోసి అంటించడానికి ప్రయత్నించింది. అయితే అతడు తృటిలో తప్పించుకుని బయటపడ్డాడు.
దీంతో మళ్లీ ఇద్దరు వేరే ఊరికి మారిపోయారు. 2005లో మొబైల్ ఫోన్ కొన్న కమల గంటల తరబడి అందులో ఎవరితోనో మాట్లాడేది. అతడు ప్రశ్నించగా.. బంధువుతో మాట్లాడుతున్నానని చెప్పేది. అక్టోబర్ 2007లో కమల ఫోన్లో ‘గుడ్ నైట్ డార్లింగ్, ఐ లవ్ యూ’ అన్న మెసేజ్ చూసి ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడిపై ఆగ్రహానికి గురైంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నా ఆమె ప్రవర్తనలో ఏ మార్పురాలేదు. యుక్త వయస్సులో ఉన్న పిల్లలను వెంటబెట్టుకుని ప్రియుడితో కలిసి ఐస్క్రీమ్ పార్లర్లకు వెళ్లేది. దాదాపు 15 అడుగుల దూరంలో వారిని కూర్చోబెట్టేది. ఆమె, ఆమె ప్రియుడు దూరంగా కూర్చునేవారు.
అనంతరం తమ వైపు చూడవద్దంటూ తల్లి పిల్లలను ఆదేశించేది. ఆ తర్వాత పిల్లలు ముందే వారు కౌగిలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం వంటివి చేసేవారు. దీంతో పిల్లలు ఈ విషయాన్ని తండ్రికి తెలియజేశారు. భార్య మోసాన్ని గ్రహించిన అతడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. 2013లో కోర్టు అతడికి విడాకులు మంజూరు చేయటంతో పాటు పిల్లల సంరక్షణను అప్పగించింది. అయితే కమల దీన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆమె ఇద్దరు పిల్లల వాగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమె పిటిషన్ను కొట్టిపారేసింది. తప్పుడు ప్రవర్తన కలిగిన తల్లితో తాము ఉండేది లేదని వారు తేల్చిచెప్పటం గమనార్హం.