కర్నూలులో మెడికో ఆత్మహత్య

medico suicide in kurnool district - Sakshi

కర్నూలు హాస్పిటల్‌ : కర్నూలు మెడికల్‌ కళాశాల ఆర్థోపెడిక్‌ విభాగంలో పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న విష్ణుప్రియ అనే విద్యార్థిని మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం నగరానికి చెందిన ఎన్‌.వి.మోహన్‌రెడ్డి భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. రెండవ కుమార్తె విష్ణుప్రియకు కర్నూలు మెడికల్‌ కళాశాల ఆర్థోపెడిక్‌ విభాగంలో పీజీ సీటు రావడంతో మిడుతూరు డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న పిన్ని ఇంటిలో ఉంటోంది.

మంగళవారం రాత్రి 7 గంటలకు విధులు ముగించుకుని స్థానిక చాణక్యపురి కాలనీలోని నివాసానికి చేరుకున్న విష్ణుప్రియ పిన్నికి విష్ణుప్రియ ఉరేసుకుని ఉండడం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలసి విష్ణుప్రియను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. చలాకీగా, అందరితో కలుపుగోలుగా ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని ఆర్థోపెడిక్‌ విభాగం వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్నా.. నన్ను క్షమించు. జీవితంలో ఓడిపోయాను. నేను బలహీనురాలిని. పోరాడే ధైర్యం లేదు’ అంటూ విష్ణుప్రియ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top