అప్పు కట్టలేక భార్య,కూతుర్ని చంపించి..

Madhya Pradesh Man Hires Shooter To Murder Family Killed Himself - Sakshi

భోపాల్‌ : తీసుకున్న అప్పు కట్టలేక భార్య, కూతుర్ని చంపించి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యాపారి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుందేల్‌ఖండ్‌కు చెందిన సిమెంట్‌ వ్యాపారి బ్రాజేశ్‌ చౌహారియా వ్యాపారంలో నష్టాల కారణంగా అప్పుల్లో కూరుకు పోయాడు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చే మార్గం కనిపించలేదతనికి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భార్య, కూతురు తనతో పాటు ఆత్మహత్య చేసుకోవటానికి ఒప్పుకోరన్న ఉద్దేశ్యంతో వారిని చంపించాలనుకున్నాడు. ఇందు కోసం బీహార్‌కు చెందిన ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ రంజన్‌ రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బయటకు వెళుతున్న సమయంలో భార్య,కూతురికి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చిన బ్రాజేశ్‌ వారు స్పృహ కోల్పోగానే వారు ప్రయాణిస్తున్న కారును ఓ చోట ఆపి దూరంగా వెళ్లిపోయాడు. అనంతరం కారులో పడిఉన్న అతడి భార్యను, కూతుర్ని హతమార్చిన రంజన్‌ ఆ విషయాన్ని బ్రాజేశ్‌కు చెప్పాడు. కారు దగ్గరకు వెళ్లి ధ్రువీకరించుకుని వస్తానన్న బ్రాజేశ్‌ వెనక్కు తిరిగి రాలేదు. రంజన్‌కు అనుమానం వచ్చి కారు దగ్గరకు వెళ్లి చూడగా బ్రాజేశ్‌ ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో అతడు బ్రాజేశ్‌ తుపాకిని తీసుకుని అక్కడినుంచి పశ్చిమ బెంగాల్‌కు పారిపోయాడు. కారులో మూడు శవాలను కనుగొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని సిమెంట్‌ వ్యాపారి బ్రాజేశ్‌గా మిగిలిన ఇద్దర్ని అతడి భార్య, కూతురిగా పోలీసులు గుర్తించారు. బ్రాజేశ్‌ కాల్‌ డేటాను సేకరించిన పోలీసులు రంజన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top