ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Love Couple Commits Suicide Attempt In Visakhapatnam - Sakshi

వివాహానికి పెద్దలు నిరాకరించారని..

కోలుకుంటున్న యువతీ, యువకుడు

విశాఖపట్నం, నర్సీపట్నం: వివాహానికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని ఓ లాడ్జిలో శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక  స్థితిలో ఉన్న ఇద్దరినీ తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం విశాఖకు తరలించారు.  వివరాలు ఇలావున్నాయి. నర్సీపట్నం  మున్సిపాలిటీ పరిధి జోగునాధునిపాలెం గ్రామానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన కిల్లాడ గంగా ప్రసాద్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గంగాప్రసాద్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా, యువతి ఇంటర్మీడియట్‌ చదివి  ప్రస్తుతం గాజువాకలో కంప్యూటర్‌ శిక్షణ పొందుతోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో  ఆయా కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. అదే సమయంలో జోగునాధునిపాలెం గ్రామానికి చెందిన మరో యువకునితో యువతికి పెళ్లి కుదిర్చారు. ఇది ఇష్టంలేని యువతి గత నెల 27న కంప్యూటర్‌ క్లాస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మూడు రోజుల వరకు యువతి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనువు చాలిద్దామని నిర్ణయించుకుని ఇద్దరూ  శుక్రవారం ఉదయం అన్నవరం లాడ్జీలో పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమ జంటను గుర్తించి లాడ్జీ సిబ్బంది అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. వారు తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి విశాఖపట్నం తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. అన్నవరం పోలీసులు జరిగిన సంఘటనపై సమాచారం అందించినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top