ఆర్టీసీ బస్‌ను ఢీకొన్న లారీ

Lorry And Bus Accident In East Godavari - Sakshi

తూర్పుగోదావరి , గొల్లప్రోలు (పిఠాపురం): చెందుర్తి–వన్నెపూడి మధ్య 16వ నంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆర్టీసీ బస్సును గ్యాస్‌ ట్యాంకర్‌ లారీ ఢీ కొట్టింది. విశాఖపట్నం నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సుకు చెందుర్తి పెదచెరువు ప్రాంతంలో వచ్చే సరికి లైట్లు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు సిబ్బంది లైట్లను పరిశీలిస్తుండగా.. బస్సులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి మూత్రవిసర్జన కోసం వెనుకకు వెళ్లిన వారిని లారీ ఢీకొట్టి, అదే వేగంతో బస్సును వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో విజయనగరం జిల్లా జామి మండలం కుమరానికి చెందిన వంకా శ్రీను ఆసుపత్రికి తరలించిన వెంటనే చనిపోయాడు.

గాయపడిన వారిలో ఎంకే వలసకు చెందిన త్రినాథ్, గార మండలానికి చెందిన నవీన్‌ ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియలేదు. గాయపడిన క్షతగాత్రులను గొల్లప్రోలు ఎస్సై బి.శివకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అంబులెన్స్‌పై కాకినాడ, ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బస్సు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 37మంది ప్రయాణికులు ఉన్నారు. గొల్లప్రోలు ఎస్సై సంఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top