పెళ్లింట విషాదం | Elderly Women Died in Bus Accident Krishna | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Apr 26 2019 12:45 PM | Updated on Apr 26 2019 12:45 PM

Elderly Women Died in Bus Accident Krishna - Sakshi

పెళ్లికి వెళుతూ బస్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

కృష్ణాజిల్లా, భవానీపురం(విజయవాడ వెస్ట్‌): ఒక వైపు పచ్చని తోరణాలతో కళకళలాడుతున్న ఇల్లు. మరో వైపు కుటుంబ సభ్యులు, బంధువుల సందడి. ఇంకో వైపు వివాహ వేదిక దగ్గరకు వెళ్లేందుకు హడావుడి. ఇంతలోనే ఓ పిడుగులాంటి దుర్వార్త తెలిసి అక్కడికి వచ్చిన వారంతా నిశ్చేష్టులైయ్యారు. మనుమడి పెళ్లి వేడుకలకని బయలుదేరిన ఒక వృద్ధురాలిని బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన భవానీపురం బైపాస్‌ రోడ్‌లో గురువారం వేకువ జామున చోటు చేసుకుంది.

పోలీసులు కథనం ప్రకారం.. సీపీఐ సీనియర్‌ నాయకుడు, పంచాయితీరాజ్‌ శాఖ విశ్రాంత ఉద్యోగి బాపనపల్లి వీరంజనేయులు, చిట్టెమ్మ దంపతులు భవానీపురం హౌసింగ్‌బోర్డ్‌కాలనీ ఎంఐజీ 187/5లో నివసిస్తున్నారు. గురువారం తెల్లవారు జామున తన మనుమడు వివాహానికి ముహూర్తం ఉండటంతో కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి 3.30 గంటల సమయంలో బైక్‌లపై కల్యాణమండపానికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భార్య చిట్టెమ్మ(60) పెద్ద అల్లుడు గద్ద సూరిబాబు బైక్‌పై ఎక్కింది. అందరి కంటే వెనుకగా వెళుతున్న వీరి బైక్‌ను తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ హైర్‌ బస్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి కిందపడిపోయిన చెట్టెమ్మ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సూరిబాబు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement