కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Constable Commits Suicide in Chittoor - Sakshi

పండుగరోజు విషాదం

కలికిరి: స్థానిక బండకాడపల్లిలో నివాసం ఉంటూ జిల్లాలోని సత్యవేడులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌కుమార్‌ సోమవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. బండకాడపల్లికి చెందిన గడ్డం ఏసురత్నం కుమారుడు ప్రేమ్‌కుమార్‌ 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ (పీసీ నెం.3760). సత్యవేడులో విధులు నిర్వహిస్తున్న ఇతను గతేడాది నవంబరు 12 నుంచి విధులకు వెళ్లకపోవడంతో ఇతన్ని డిజెక్టర్‌ చేశారు. దీంతో అతను ఇటీవల జిల్లా ఉన్నతాధికారులను కలసి విన్నవించగా, ఎన్నికల విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. అయితే మరలా విధులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్న అతన్ని విధులకు వెళ్లాలని భార్య మందలించింది.

లెక్కచేయకపోవడంతో.. తన భర్తను విధులకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ఉదయం కలికిరి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడిన స్థానిక పోలీసులు విధులకు వెళ్లాలని నచ్చజెప్పారు. ఇంటికి వెళ్లిన తరువాత భార్య నిరోషా తాగునీరు తీసుకురావడానికి కుళాయి వద్దకు వెళ్లింది. ఈ సమయంలో ప్రేమ్‌కుమార్‌ ఇంటిపైకప్పు కొక్కీకి చీరతో ఉరివేసుకున్నాడు. ఎంత సేపటికీ గడియ తీయకపోవడంతో భార్య నిరోషా ఇరుగుపొరుగు వారిని పిలిచి గడియ తీసి చూసింది. భర్త ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సాయంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించింది.

పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రేమశ్రీ(7), రక్షిత(6), కుమారుడు యశ్వంత్‌(4) ఉన్నారు.

పండుగ రోజు విషాదం..
మహాశివరాత్రి పర్వదినం రోజున కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త మృతదేహం వద్ద చిన్నారులతో కలిసి భార్య నిరోషా రోదించడం చూసిన ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు.

పోలీసు సంఘం ఆర్థిక సాయం..
జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ్‌కుమార్‌ కుటుం బానికి దహన ఖర్చులకు గాను రూ.15వేలు అందజేశారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సాయం త్వరితగతిన అందేలా యూనియన్‌ తరఫున కృషి చేస్తామని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top