వెంటాడిన మృత్యువు | Boy Died Bike Accident in Srikakulam | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Apr 15 2019 1:30 PM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Died Bike Accident in Srikakulam - Sakshi

విలపిస్తున్న తల్లి, బంధువు

శ్రీకాకుళం ,ఆమదాలవలస/ భామిని: తల్లి చేయి పట్టుకుని బస్టాండ్‌లో నిల్చున్న ఆ బాలుడిని బైక్‌ రూపంలో మృత్యువు వెంటాడింది. బంధువును పరామర్శించడానికి తల్లిదండ్రులతోపాటు కలిసి వెళ్తు్తండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కళ్ల ఎదుటే ఇంతటి ఘోరం జరగడంతో గుండెలు అవిసేలా రోదించారు. ఆమదాలవలస పట్టణ శివార్లలోని ఎస్‌ఎల్‌నాయుడు పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా (శ్రీకాకుళం పాలకొండ రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి డౌన్‌లో) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందారు. ఎస్‌ఐ జి.వాసుదేవరావు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం. భామిని మండలం నేరడి–బి గ్రామానికి చెందిన అంపావిల్లి శ్రీను, గౌరి దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్‌ (10) తల్లిదండ్రులతో కలిసి నెల్లూరు వెళ్లేందుకు విశాఖపట్నం రైల్వే స్టేన్‌కు చేరుకున్నారు.

వీరఘట్టం మండలంలోని గౌరి బంధువు ఒకరు మృతి చెందారని ఫోన్‌ రావడంతో అక్కడ నుంచి తిరిగి వచ్చారు. ఆమదాలవలస బ్రిడ్జి వద్ద పాలకొండ బస్టాప్‌లో బస్సు  కోసం వేచి ఉన్నారు. ఇంతలో ఎల్‌.ఎన్‌.పేట మండలం రావిచంద్రి గ్రామానికి చెందిన కల్లేపల్లి అప్పలనాయుడు బైక్‌పై అతి వేగంతో పాలకొండ వైపు నుంచి శ్రీకాకుళం వస్తున్నాడు. అక్కడ ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో బైక్‌ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టాడు. ప్రశాంత్‌ అక్కిడికక్కడే కూలిపోయి కొనఊపిరితో ఉండగా ఆమదాలవలస పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోగా బాలుడు ప్రాణాలు విడిచిపెట్టినట్లు తల్లిదండ్రులు, బంధులు చెప్పారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతిని తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నేరడి–బిలో విషాదం
భామిని మండలంలోని నేరడి–బి గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన అంపావిల్లి శ్రీను, గౌరి దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్‌ ఆముదాలవలసలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నెల్లూరు జిల్లా కొండపల్లిలో ఉంటున్న శ్రీను, గౌరిలు కుమారుడితో కలిసి ఓటు చేయడానికి నేరడికి వచ్చారు. ఆదివారం తిరుగు పయనంలో ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement