బోటు యజమాని వెంకట రమణ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్ట్‌: ఎఎస్పీ

Published Fri, Sep 20 2019 7:00 PM

Boat Capsizes In Godavari: Boat Owner Venkata Ramana Arrested  - Sakshi

సాక్షి, రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కల్లూరు వద్ద గోదావరిలో బోటు బోల్తా ప్రమాద ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ మాట్లాడుతూ...‘ఈ ​కేసులో బోటు యజమానితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశాం. లాంచీ యజమానుల్లో ప్రధానంగా ఏ-వన్‌ గా ఉన్న కోడిగుడ్ల వెంకటరమణతో పాటు ఏ-2 ఎల్లా ప్రభావతి, ఏ-3 అచ్యుతమణిని అరెస్ట్ చేశాం. ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ...దానిపై విచారణ చేస్తున్నాం.

చదవండి: ఆపరేషన్‌ ‘రాయల్‌ వశిష్ట పున్నమి’

గోదావరి ప్రవాహ ఉధృతిని బోటు డ్రైవర్‌ అంచనా వేయలేకపోవడం, సుడులు తిరుగుతున్న నీటి నుండి తప్పించుకుని, సురక్షిత మార్గంలో బోటును ముందుకు తీసుకువెళ్లే విషయంలో బోటు డ్రైవర్‌కు సరైన అవగాహన, అనుభవం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎడమ పక్కకు వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలో నడిపారు. ఇందులో పోలీసుల తప్పిదం లేదు. పోలీసులు తనిఖీ చేసినప్పుడు బోటులోని వారంతా లైఫ్‌ జాకెట్లు వేసుకున్నారు. పోలీసులు వెళ్లగానే లైఫ్‌ జాకెట్లు తీసేయవచ్చని బోటు సిబ్బంది చెప్పారు. బోటులో మొత్తం 64మంది పెద్దవాళ్లు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 8మంది బోటు సిబ్బంది సహా 75మంది ఉన్నారు. బోటును బయటకు తీసుకు వచ్చేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ 34 మృతదేహాలు వెలికి తీశాం’ అని తెలిపారు. 

Advertisement
Advertisement