జేబులోనే పేలిన శాంసంగ్‌ ఫోన్‌

Samsung phone explodes in man's pocket

న్యూఢిల్లీ : శాంసంగ్‌ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్‌ మళ్లీ పేలింది. అయితే ఈ సారి ఛార్జింగ్‌ పెడుతుండగానో, ఫోన్‌ మాట్లాడుతుండగానో కాదు జేబులో పెట్టుకోగానే అది పేలిపోయింది. ఈ ఫోన్‌ పేలిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే ఈ సారి పేలుడు ఘటను చోటుచేసుకుంటున్న గెలాక్సీ నోట్‌7 కాదు, శాంసంగ్‌ గ్రాండ్‌ డ్యూస్‌ స్మార్ట్‌ఫోన్‌ అట. డైలీ మెయిల్‌ రిపోర్టు ప్రకారం,  47 సంవత్సరాల హోటల్ సూపర్ వైజర్ యులియాన్టో ఇండోనేషియాలోని ఓ హోటల్ లాబీలో వేచి చూస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన జేబులో నుంచి హీటింగ్‌ సెన్సేషన్‌ రావడం మొదలైంది. అనంతరం ఒక్కసారిగా జేబులోనే ఫోన్‌ పేలిపోయింది. వెంటనే ఆ మంటలు చొక్కాకు కూడా అంటుకున్నాయి. అనంతరం ఆయన వేచిచూస్తున్న రూమంతా పొగ కమ్ముకుంది.

పేలిన ఫోన్ నుంచి మంటలు రావటంతో యులియాన్టో ముఖానికి గాయాలు అయ్యాయి.  షాక్‌ నుంచి తేరుకుని వెంటనే చొక్కా విప్పేసినట్టు యులియాన్టో చెప్పాడు. ఈ ఘటన సెప్టెంబర్‌ 30న చోటుచేసుకుంది. ఇదంతా యులియాన్టో వేచిచూస్తున్న హోటల్‌ లాబీ సీసీటీవీలో రికార్డైంది. శాంసంగ్‌ ఈ ఫోన్‌ను 2013లో లాంచ్‌ చేసింది. ఫోన్ లో ఒకేసారి వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఆన్ చేసి వినియోగించటం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇండోనేషియా పోలీసులు, టెలికాం నిపుణులు విచారణ చేపట్టారు. వినియోగదారుల భద్రతను ముఖ్యమైన అంశంగా తీసుకున్న కంపెనీ, అవసరమైన మద్దతంతా కల్పిస్తామని చెప్పింది. గతేడాది గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుళ్ల ఘటనలతో శాంసంగ్‌ తీవ్ర ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలు స్మార్ట్‌ఫోన్ల రారాజును తీవ్రంగా దెబ్బకొట్టాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top