అమరావతిలో  ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌! 

NCCL Benchmark in Amravati - Sakshi

మరొకటి ఇండోర్‌లో ఏర్పాటు...  

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేసుల భారం ప్రత్యేకించి ఐబీసీ (ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ) 2016  కింద వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బెంచ్‌ల ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ వివాదాలు అమరావతి బెంచ్‌ న్యాయపరిధిలోకి వస్తుండగా, మధ్యప్రదేశ్‌లోని దివాలా అంశాల న్యాయపరిధి ఇండోర్‌ బెంచ్‌ పరిధిలోకి వస్తుంది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వివాదాలు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పరిధిలోకి వెళుతుండగా, మధ్యప్రదేశ్‌కు సంబంధించి దివాలా వివాదాలు అహ్మదాబాద్‌  బెంచ్‌ పరిధిలోకి వస్తున్నాయి. న్యూఢిల్లీలోని ప్రధాన బెంచ్‌ సహా దేశంలో ప్రస్తుతం 14 ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top