ప్రభుత్వ ఉద్యోగమా అదెక్కడ! | where is govt job? | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగమా అదెక్కడ!

Oct 13 2017 2:13 AM | Updated on Nov 6 2018 8:08 PM

where is govt job? - Sakshi

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, అటు ప్రైవేటు ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతోంది.

సాక్షి, అమరావతి :రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథ్‌ కమిటీకి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం.. ఏపీలోని 13 జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య 1,42,825గా పేర్కొన్నారు. 2014, జూన్‌ 2 తర్వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంతో ఇప్పటివరకు దాదాపు 45 వేల మంది పదవీ విరమణ చేశారు. ఈ లెక్కన ఖాళీల సంఖ్య మొత్తం 1,87,825 అవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ఖాళీలు లేవంటోంది.

భర్తీ చేసినవి నామమాత్రమే..
ప్రభుత్వ శాఖల్లో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఎన్నికైన రెండేళ్ల తర్వాత కేవలం 6 వేల పోస్టులకు మాత్రమే ఏపీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటిల్లో గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులు ఇంతవరకు భర్తీ కాలేదు. వీటి సంగతి దేవుడెరుగు 1999 నాటి గ్రూప్‌–2 అభ్యర్థులే ఇంకా భర్తీకి నోచుకోలేదు. ఇప్పటివరకు ఏపీపీఎస్సీ 32 నోటిఫికేషన్ల ద్వారా 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినా అందులో పూర్తిచేసినవి అతి తక్కువ మాత్రమే.

యూనివర్సిటీ పోస్టుల భర్తీ ఇంకెప్పుడు?
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో దాదాపు 4 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం వాటిని రేషనలైజేషన్‌ పేరిట 1385కి కుదించేసింది. వాటిని 2016–17లో 1104, 2017–18లో 281 చొప్పున రెండు విడతల్లో భర్తీ చేయాలని సూచించింది. అయితే ఈ రేషనలైజేషన్‌ ప్రక్రియలో అనేక లోపాల కారణంగా న్యాయస్థానం జీవోను కొట్టేయడంతో పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఏటా డీఎస్సీని ప్రకటించి టీచర్‌లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఈ మూడేళ్లలో ఒక్కటే నోటిఫికేషన్‌ వెలువరించింది. దాదాపు 23 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 10,313 పోస్టులను భర్తీ చేసింది. రేషనలైజేషన్‌ పేరిట స్కూళ్లను మూసేయడంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య కూడా కుదించుకుపోయింది. డీఎస్సీలో ఎంపికైనవారిలోనూ కొంతమందికి మాత్రమే పోస్టింగులు ఇచ్చి మిగతా వారిని డీఈవో పూల్‌ కోటాలో పెట్టారు. ఇంకా దాదాపు 13 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా డీఎస్సీని ప్రకటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు.

కళాశాల అధ్యాపకుల  భర్తీలోనూ కళ్లకు గంతలు
రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా తూతూమంత్రంగా కొన్నిటికి మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాష్ట్రంలో 146 డిగ్రీ కాలేజీల్లో 3,300 వరకు అధ్యాపక పోస్టులున్నాయి. ఇందులో 1500 మంది మాత్రమే పనిచేస్తుండగా తక్కిన 1800 పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టుల్లో 740 మంది అర్హులైన కాంట్రాక్టు అధ్యాపకులున్నారు. 16 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్‌ చేయాలని వారు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో ప్రభుత్వ కాలేజీలు 442, ఎయిడెడ్‌ కాలేజీలు 202 ఉన్నాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ, గురుకుల జూనియర్‌ కాలేజీలను కలుపుకుంటే మొత్తం 1032 జూనియర్‌ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో 1400 మంది మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. దాదాపు 4 వేల మంది అర్హులైన అభ్యర్థులు కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడూ ఊడతాయో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వీరితో ఏడాదిలో ప్రతి ఆరునెలలకోసారి మాత్రమే పనిచేసే ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంటోంది. ఒప్పందం గడువు పూర్తయ్యాక ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీదనే వీరు బతకాల్సి వస్తోంది.

కమల్‌నాథన్‌ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏపీలో ఖాళీలు..
స్టేట్‌ లెవల్‌ (గ్రూప్‌–1, గెజిటెడ్, ఎన్జీవో, తదితర)– 4078, మల్టీజోనల్‌ (గ్రూప్‌–1, గెజిటెడ్, ఎన్జీవో)–1184, జోనల్‌ (గెజిటెడ్, ఎన్జీవో, తదితర) – 22462, జిల్లా స్థాయిలో (గ్రూప్‌–1, గెజిటెడ్, ఎన్జీవో, ఎయిడెడ్, తదితర) – 1,15,101. మొత్తం పోస్టులు 1,42,825. కాగా మంజూరైన పోస్టులు మాత్రం.. 6,97,621 ఉండగా ప్రభుత్వం చూపుతోంది.. లక్షా 42, 825 పోస్టులే.

ఏపీపీఎస్సీ ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లు ఇవే..
లక్షలో సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉంటే ఇప్పటివరకు ఏపీపీఎస్సీ జారీ చేసింది కేవలం 4,275 పోస్టులకే మాత్రమే. అవి.. పంచాయతీ కార్యదర్శులు (1055), గ్రూప్‌–2 (982), ఏఈఈ (748), డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్లు (504), డిప్యూటీ సర్వేయర్లు (259), అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ (199), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ (95), గ్రూప్‌–1 (78), టెక్నికల్‌ అసిస్టెంట్లు (67), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు (పురుషులు) (51), మహిళలు (49), వ్యవసాయాధికారులు (30), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (24), అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌ (21), టౌన్‌ప్లానింగ్‌ సబార్డినేట్‌ (13), అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (13), అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఫిషరీస్‌ (10), అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (10), అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఎకనమిక్, స్టాటిస్టికల్‌ (8), జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ (7), అసిస్టెంట్‌ ఆర్కిటెక్చర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ (7), వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (6), అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (6), మైనింగ్‌ రాయల్టీ ఆఫీసర్‌ (5), టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (5), టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ (5), ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ (5), ఫిషరీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 4, లేబొరేటరీ అసిస్టెంట్‌ (3), డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (2), క్లినికల్‌ పాథాలజిస్ట్‌ (2), అసిస్టెంట్‌ కెమిస్ట్‌ (2).

ఏటా లక్షల్లో పెరుగుతున్న నిరుద్యోగులు
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఏటా లక్షల్లో పెరుగుతున్నా వారికి సరైన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియెట్, టీచర్‌ ట్రైనింగ్, బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్, బీఈడీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీలు పూర్తిచేసి బయటకు వస్తున్న వారి సంఖ్య ఏటా 10 లక్షల మందికి పైగా ఉంటోంది. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఖాళీ పోస్టులున్నా భర్తీ చేయడం లేదు. విభజన తర్వాత రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమా లేకపోవడంతో ప్రైవేటులోనూ ఉద్యోగాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు కూడా కరవయ్యాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఊతంగా ఉండే ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబునాయుడు విస్మరించడంతో ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ప్రముఖ పరిశ్రమ ఒక్కటీ ఏర్పాటుకాలేదు. ఫలితంగా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి.

అవుట్‌సోర్సింగ్‌కూ కోత
రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో రెగ్యులర్‌ పోస్టుల భర్తీ ఎలాగూ చేయలేదు. కనీసం అవుట్‌సోర్సింగ్‌ నియామకాలన్నా చేసిందా అంటే అవీ కనిపించడం లేదు. పైగా గత కొన్నేళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్వాసన పలికింది. ఆరోగ్యమిత్ర,, గోపాలమిత్రలను తొలగించింది. గత మూడేళ్లలో ప్రభుత్వం వివిధ విభాగాల్లోని దాదాపు 30 వేల మంది వరకు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఇళ్లకు సాగనంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement