మా.. వాళ్లనే నియమించండి | Transfers of employees concerned | Sakshi
Sakshi News home page

మా.. వాళ్లనే నియమించండి

Aug 20 2014 2:56 AM | Updated on Oct 30 2018 5:17 PM

అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఇష్టారాజ్యంగా ఉద్యోగులను బదిలీ చేయించేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే విమర్శలొస్తున్నాయి.

  • అధికార పార్టీ నేతల హుకుం
  •   ఉద్యోగుల్లో బదిలీల ఆందోళన
  •   సొంత జాబితాలు సిద్ధం చేసిన ఇరువురు ఎమ్మెల్యేలు
  •   ఉన్నతాధికారులపై ఒత్తిడి
  • మచిలీపట్నం : అధికార పార్టీకి చెందిన  కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఇష్టారాజ్యంగా ఉద్యోగులను బదిలీ చేయించేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే విమర్శలొస్తున్నాయి. తమ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులే తమ నియోజకవర్గంలో పనిచేయాలని, తాము తయారు చేసిన జాబితా ప్రకారమే ఉద్యోగుల బదిలీలు జరగాలని విజయవాడ సమీపంలోని ఇరువురు ఎమ్మెల్యేలు పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది.  

    అంతటితో ఆగకుండా తమ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఎక్కడున్నారో ఆరా తీసి తమ నియోజకవర్గంలో నియమించుకునేందుకు సొంత జాబితాలు సిద్ధం చేశారు. ఈ జాబితాలను జిల్లాస్థాయి ఉన్నతాధికారుల వద్ద పెట్టి వీటి ప్రకారమే బదిలీలు జరగాలంటూ ఒత్తిడి తెస్తుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ అనంతరం వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతున్న ఓ నియోజకవర్గంలో అధికార పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి  సొంత జాబితా తయారు చేయటం చర్చనీయాంశమయ్యింది.

    మండలాల వారీగా, గ్రామస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఫలానా అధికారి కావాలి, ఫలానా అధికారి అక్కర్లేదంటూ తయారు చేసిన జాబితాను నేరుగా ముఖ్యమంత్రికే ఇవ్వడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఇరువురు ఎమ్మెల్యేలు తయారు చేసిన జాబితాల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు జరగాలని జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద వీరు ప్రతిపాదన తెచ్చారు.

    అయితే వీరి దూకుడును గమనించిన మంత్రి అన్ని సామాజికవర్గాల వారు ఓట్లు వేస్తేనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులను నియోజకవర్గాల్లో నియమించాలంటే ఎలా అని   ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసినా బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయలేదు.

    ఈలోపుగానే నందిగామ ఉపఎన్నికకు షెడ్యూలు ప్రకటించటంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. సెప్టెంబరు 13న నందిగామలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 20వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బదిలీలు జరుగుతాయా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ పక్కన పెట్టిన అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు ఇష్టం లేని ఉద్యోగులను బదిలీ చేయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేయటం గమనార్హం.
     
    తీరు మారదా :
     
    టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తారనే అపవాదు గతంలో ఉండేది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులను సక్రమంగా చూసుకుంటామని హామీలు గుప్పించారని ఉద్యోగులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత పద్ధతులే కొనసాగుతున్నాయనేది ఉద్యోగుల వాదనగా ఉంది. వారంలో ఐదు రోజుల పనిదినాలే అమలు చేస్తామని చెప్పినా ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదనేది ఉద్యోగుల వాదన.

    ఇంక్రిమెంట్లు, పీఆర్సీ, హెల్త్‌కార్డుల జారీ తదితర అంశాలపై ప్రభుత్వం పెదవి విప్పకుండా...వంద రోజుల ప్రణాళిక పేరుతో ఏవేవో కార్యక్రమాలను రూపొందిస్తున్నారని  ప్రతిరోజూ ఐదు ఫార్మాట్లలో నివేదికలు పంపాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. దీనికితోడు వారంలో రెండు, మూడు రోజుల పాటు సమావేశాలకే సమయం సరిపోతుందని ఉద్యోగులు చెబుతున్నారు.  టీడీపీ పాలనలో పనులు జరగకుండానే నివేదికలు ఇవ్వడం గతంలోనే జరిగిందని, మళ్లీ అదే తీరున ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు చెప్పుకోవటం గమనార్హం.
     
    ఎన్జీవో నేతలు జోక్యం చేసుకునేనా :
     
    అధికార పార్టీ   నాయకులు ఇష్టారాజ్యంగా ఉద్యోగులను బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘం నాయకులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement