‘రథం’...రగడ..! | The leaders of the Congress, Gandhi yatra 'brought a new Troubles | Sakshi
Sakshi News home page

‘రథం’...రగడ..!

Jan 3 2014 3:19 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పెద్దలు జిల్లాలో ప్రారంభించిన ‘ఇందిర విజయ యాత్ర’ ఎటు తీసుకెళ్తుందోనని ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. నేతల మధ్య ఉన్న విభేదాలతోనే వారికీ ఈ సందేహాలు కలుగుతున్నాయి.

 కాంగ్రెస్ పెద్దలు జిల్లాలో ప్రారంభించిన ‘ఇందిర విజయ యాత్ర’ ఎటు తీసుకెళ్తుందోనని ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. నేతల మధ్య ఉన్న విభేదాలతోనే వారికీ ఈ సందేహాలు కలుగుతున్నాయి. అంతాకలిసి చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఒంటెత్తు పోకడగా పోతుండడం వల్ల పార్టీకి ఒనగూరేది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొద్ది నెలల కిందట మంత్రి అరుణ చేపట్టిన సభలకు కొందరు ‘పెద్దలు’ ఉద్దేశపూర్వకంగా దూరమైతే..ఇప్పుడు వీహెచ్ యాత్రకు ఆమె దూరంగా ఉండం విమర్శలకు తావిస్తోంది. ఆ పార్టీలోని లుకలుకలకు అద్దం పడుతోంది.
 
 మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధిః జిల్లాలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన ‘ ఇందిరా విజయయాత్ర’ కొత్త తంటాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే లోలోన రగులుకుంటున్న అసమ్మతి కుంపట్లు దీంతో మరింత రాజుకునేటట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు కృతజ్ఞతలు చెప్పే పేరుతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో గురువారం రథయాత్రను ప్రారంభించిన సంగతి విదితమే.దీన్ని మంత్రి డి.కె.అరుణ అందుబాటులో లేని సందర్భంలో చేపట్టడమే అనేక ఊహలకు ఊతమిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
 
 అప్పుడు వారు డుమ్మా...
 ఎన్నికలు దగ్గర పడుతున్నా కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఒక్కటయ్యే పరిస్థితి కన్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నందుకు వీలుగా మంత్రి డీకే అరుణ జైత్రయాత్ర పేరుతో ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన గద్వాలలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించిన సంగతి విదితమే. దీనికి జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి జయపాల్‌రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి. చిన్నారెడ్డి అప్పట్లో హాజరు కాలేదు. ఇప్పుడు వీహెచ్ చేపట్టిన యాత్రలో కూడా ఈ స్పర్థలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.
 అన్నీ ఆయనే... నాడు అరుణ నిర్వహించిన కార్యక్రమానికి దూరంగా ఉన్న   ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి ఇప్పుడు వీహెచ్ యాత్రను దగ్గరుండి పర్యవేక్షిస్తుండ టం విశేషం. ఈ కారణంగానే  మంత్రి  ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.ఆ మె సన్నిహితులు మాత్రం అరుణ వ్యక్తిగత పనుల వల్ల ప్రస్తుతం మరో రాష్ట్రానికి వెళ్లినందున మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని చెప్పుకొస్తున్నారు.  కాగా కొంత కాలంగా రాజకీయ విభేదాలు ఉం డటం కారణంగానే హనుమంతరావు ఆధ్వర్యంలో చేపట్టిన రథ యాత్రకు మంత్రి దూరంగా ఉంటున్నారని మరికొందరు చెబుతున్నారు. జిల్లాలో ఆమెకు కాంగ్రెస్‌కు కీలక నాయకురాలిగా ఉంటూ కూడా ఇ ప్పుడు యాత్రకు దూరం కావడం చర్చనీయాంశమే. అంతేకాకుండా జిల్లాలో డీకే అరుణ దృష్టి సారించిన కొల్లాపూర్, గద్వాల, మక్తల్, నారాయణపేట, కొండంగల్ నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు యాత్ర చే పట్టే విధంగా నాయకులు రూట్ మ్యాప్‌ను తయా రు చే యడం గమనార్హం.
 
 కాంగ్రెస్‌కు మైలేజి వచ్చేనా...?
 ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉ ద్యమం, అమరుల ఆత్మత్యాగాలను అర్థం చేసుకు న్న సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కో సం నిర్ణయం తీసుకున్నం దుకు  రథయాత్ర కార్యక్రమం అని పాలకపక్ష పెద్దలు చెప్తున్నారు. అంతర్గతం గా బలహీన పడిన పార్టీని కొంతమేరకైనా  బలోపేతం చేయొచ్చన్నది కాంగ్రెస్ నేతల ఆశగా కనిపిస్తోంది. జి ల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా ఇందులో గద్వాల, అలంపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
 వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉద్యమంలో పాల్గొనలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసం సీడబ్ల్యూసీలో  నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీకి చెందిన నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇంకా భయపడుతునే ఉన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడుతాయోమోననే భయం కూడా ఇక్కడి నాయకుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో  కూడా వారు తూర్పు, పడమరల చందాన వ్యవహరిస్తుండటం కింది స్థాయి కార్యకర్తలను కలవరపరుస్తోంది.
 
  రథయాత్ర సందర్భంగా హాజరైన మంత్రులు, ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నందుకు, కలలను సాకారం చేసిన సోనియాగాంధీకి ప్రజలంతా రుణపడి ఉండాలనీ అందుకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని చెబుతున్నా ఆశించినమేరకు స్పందన కన్పించడం లేదు. మరో వైపు తమ ఆందోళన ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటుకు మార్గం ఏర్పడిందని టీఆర్‌ఎస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారనే రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో చేపట్టిన రథయాత్ర ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం మాట అటుంచితే కనీసం ఐక్యతనైనా పెంచితే గొప్పవిషయమని ఆ పార్టీ కార్యకర్తలే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement