రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్ పాటించాలని వైఎస్సార్సీపీ, ఏపీ ఎన్జీఒ సంఘం పిలుపునిచ్చాయి.
నేడు జిల్లా బంద్
Feb 13 2014 1:51 AM | Updated on Aug 18 2018 4:13 PM
విజయనగరం టౌన్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్ పాటించాలని వైఎస్సార్సీపీ, ఏపీ ఎన్జీఒ సంఘం పిలుపునిచ్చాయి. దీనికి పార్టీ శ్రేణులు సహకరించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స, అరుకు పార్లమెంటు పరిశీలకు డు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన)కోరారు. విభజన విషయంలో కేంద్ర నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చారన్నారు. బంద్ను విజయవంతం చేసేందుకు పార్టీ సమన్వయకర్తలు,
అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమైక్యాంధ్రను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి ప్రజలు బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆరుగంటల నుంచే రవాణావ్యవస్థను స్తంభింప చేయడానికి సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా వాహనాల రాకపోకలను అడ్డుకోడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో పాటు కేంద్రప్రభుత్వ సంస్థలైన పోస్టల్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలతో పాటు, బ్యాంకులను మూయించనున్నారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా బంద్ను పూర్తిస్థాయిలో నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు.అయితే విజయనగరం పట్టణంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించి ఉండడంతో పాటు, నిరసన కార్యక్రమాలపై నిషేధాజ్ఞలుండడంతో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Advertisement