సెల్‌ఫోన్‌ తెచ్చిన తంటా 

Teacher Suicide Attempt In Anantapur - Sakshi

ఉపాధ్యాయురాలి  ఆత్మహత్యాయత్నం 

సాక్షి, బుక్కపట్నం: ప్రధానోపాధ్యాయురాలు మందలించిందని మనస్తాపం చెందిన ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు, ఆమె బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తచెరువులోని బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సుమన, ఉపాధ్యాయురాలు వైజయంతికి కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయి. తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వినియోగించకూడదని హెచ్‌ఎం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం తరగతి గదిలో సెల్‌ఫోన్‌ కనిపించడంతో ఎందుకు వినియోగించావంటూ వైజయంతిని హెచ్‌ఎం మందలించింది. తాను తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వినియోగించలేదని, విద్యార్థినులే ఇందుకు సాక్ష్యమని ఉపాధ్యాయురాలు వివరణ ఇచ్చింది.

అయినా హెచ్‌ఎం ఇదేమీ పట్టించుకోకుండా మందలించడంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయురాలు వైజయంతి ల్యాబ్‌లోకి వెళ్లి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో జీతభత్యాల చెల్లింపు విషయంలోనూ హెచ్‌ఎం కావాలానే ఇబ్బందులు కలిగించిందని బాధితురాలు ఆరోపించింది. అనంతరం బాధితురాలు కొత్తచెరువులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం ఘటనపై హెచ్‌ఎంను వివరణ కోరగా తాను పాఠశాలలో పనివేళల్లోనే మాట్లాడుతానని విలేకరులకు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top