సీతమ్మకు అందలం | Sakshi
Sakshi News home page

సీతమ్మకు అందలం

Published Tue, Jan 28 2014 1:31 AM

TDP Rajya Sabha Candidate sitarama laksmi

  సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాబోయే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయా లా, ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలా అనే మీమాం శలో కొట్టుమిట్టాడుతున్న జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి అనూహ్యంగా రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆమెను పోటీకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సోమ వారం రాత్రి ఈ విషయాన్ని పార్టీ ప్రతిని దులు హైద రాబాద్‌లో ప్రకటించారు. కోస్తాజిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన సీతారామలక్ష్మిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ వర్గం వారిని ఆకర్షించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. దీంతోపాటు మహిళలకు పెద్దపీట వేశామనే సంకేతం ఇచ్చేందుకు వీలుగా సీతారామలక్ష్మికి అవకాశం ఇస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ఆమె నామినేషన్ వేయడం ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పిలుపు రావడంతో సీతారామలక్ష్మి సోమవారం సాయంత్రం హుటాహుటిన బయలుదేరి వెళ్లి చంద్రబాబును కలిశారు. 
 
 సందిగ్ధం నడుమ...
 టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల రేసులో తొలినుంచీ సీతారామలక్ష్మి పేరు విని పిస్తున్నా చివరకు ఆమెకు అవకాశం దక్కుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి రాబో యే సాధారణ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె మళ్లీ అదేస్థానం నుంచి పోటీ చేయాలా, లేదో అనే సందిగ్ధంలో ఉన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా.. గత ఎన్నికల్లో ఆమె ఓటమి చెందడం, రెండుసార్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిం చాల్సి రావడం వంటి కారణాల నేపథ్యంలో మళ్లీ లోక్‌సభకు పోటీచేస్తే ఆర్థికంగా ఇబ్బంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీతారామలక్ష్మి భీమవరం అసెంబ్లీ సీటుపై కన్ను వేయటం, స్థానిక నాయకులు వ్యతిరేకించడం పార్టీలో ఒకింత గందరగోళానికి తెరలేపింది. ఈ పరిస్థితిల్లో అనూహ్యంగా ఆమెను రాజ్యసభ అభ్యర్థుల రేసులో ముందుండటం చర్చనీయాంశమైంది. దీనిపైనా పార్టీలోని ఒకవర్గం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బహిరంగంగా ఆ విషయాన్ని ఎవరూ బయట పెట్టకపోయినా పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న సామాజిక వర్గాన్ని కాదని.. వేరే వర్గానికి చెందిన సీతారామలక్ష్మికి సీటు ఇవ్వడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. 
 

Advertisement
Advertisement