‘ఫ్రుడెన్షియల్’ రైతులకు పిప్పే? | Prudential Sugars Arrears criminal cases on Chairman | Sakshi
Sakshi News home page

‘ఫ్రుడెన్షియల్’ రైతులకు పిప్పే?

May 20 2015 3:02 AM | Updated on Aug 21 2018 5:46 PM

‘ఫ్రుడెన్షియల్’ రైతులకు పిప్పే? - Sakshi

‘ఫ్రుడెన్షియల్’ రైతులకు పిప్పే?

నిండ్ర మండలంలోని ‘ఫ్రుడెన్షియల్ షుగర్స్ ఫ్యాక్టరీ లిమిటెడ్’ చెరుకు రైతులకు కుచ్చుటోపీ పెట్టే యత్నం చేసింది...

- ప్రుడెన్షియల్ షుగర్స్‌లో *30 కోట్ల బకాయిలు
- చైర్మన్‌పై క్రిమినల్ కేసులు నమోదు
- డెరైక్టర్‌ను ప్రశ్నించిన పోలీసులు
- కంపెనీ పేరు మార్చి విక్రయించేందుకు యత్నం
- బ్యాంకులు, షేర్ హోల్డర్లు, రైతులకు మొండి చెయ్యి
సాక్షి ప్రతినిధి తిరుపతి:
నిండ్ర మండలంలోని ‘ఫ్రుడెన్షియల్ షుగర్స్ ఫ్యాక్టరీ లిమిటెడ్’ చెరుకు రైతులకు కుచ్చుటోపీ పెట్టే యత్నం చేసింది. అదే జరిగి ఉంటే రైతులకు పిప్పే మిగిలి ఉండేది. ఫ్యాక్టరీకి చెరుకు తోలిన రైతులకు జనవరి నుంచి ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. ఈ క్రషింగ్ సీజన్ నాటికి అన్నదాతలకు సుమారు *30 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలోని దాదాపు సగం మండలాల రైతులు జనవరి నుంచి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు చేతులు మార్చిన యాజమాన్యం తాజాగా మరోసారి బినామీ సంస్థకు ఫ్యాక్టరీని విక్రయించి, రైతులు, బ్యాంకులకు, షేర్లు కలిగిన భాగస్వాములకు కుచ్చు టోపీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కంపెనీ పేరు మార్పు కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ వేలం ద్వారా కంపెనీ విక్రయించి, చైర్మన్ చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ దివాలా స్థితిలో ఉందని బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ రీ కన్‌స్ట్రక్షన్(బీఐఎఫ్‌ఆర్), అఫిలేట్ అథారిటీ ఫర్ ఇండ్రస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రీకన్‌స్ట్రక్షన్(ఏఐఎఫ్‌ఆర్)కు ఢిల్లీలో విన్నవించి, డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలుస్తోంది.

చైర్మన్‌పై క్రిమినల్ కేసులు నమోదు
ఫ్రుడెన్షియల్ షుగర్స్ చైర్మన్‌పై ఓ భాగస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇందులో భాగంగా ఓ డెరైక్టర్‌ను శనివారం పోలీసులు పిలిపించి, తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించారు. కంపెనీకి సంబంధించి ఇప్పటికే ఓ భాగస్వామి తనకు రావాల్సిన వాటా ప్రకారం  *43 కోట్ల నిధులు చెల్లించాలని కోరుతూ చేసిన క్లెయిమ్‌ను కోర్టు అడ్మిట్ చేసుకుని ఆర్బిట్రేషన్‌కు ఆదేశించింది.

రైతుల్లో ఆందోళన...
తాజా పరిణామాల నేపథ్యంలో చెరకు రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ బకాయిలను రాబట్టుకోవడానికి వీలుగా  కొందరు రైతులు కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఫ్యాక్టరీకి తరలించిన చెరకుకు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే కంపెనీ చైర్మన్‌పై పలు కార్పొరేట్ నేరాలు ఉండడంతో అన్నదాతల్లో  తీవ్ర ఆందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement