వేసవి కాలం పూర్తిగా ప్రవేశించకముందే జిల్లాలో కోతల కాలం మొదలైంది. అనధికారికంగా విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి.
శ్రీకాకుళం :వేసవి కాలం పూర్తిగా ప్రవేశించకముందే జిల్లాలో కోతల కాలం మొదలైంది. అనధికారికంగా విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థాయిలో గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో అర్ధగంట పాటు విద్యుత్ను నిలిపేస్తున్నారు. పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. అయితే అధికారులు దీన్ని ధ్రువీకరించడం లేదు. కోతలు అమలు చేయాలని తమకు ఎటువంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు. జిల్లాలో 7,11,842 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
వీటిలో 6,29,081 గృహ, 44,900 వాణిజ్య, 25040 పరిశ్రమలు, 178 చిన్నతరహా పరిశ్రమలు, 250 భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 6,813 వీధి దీపాల కనెక్షన్లు, 5580 దేవాలయాలు, పాఠశాలల కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 3.1 లక్షల యూనిట్ల నుంచి 3.2 లక్షల యూనిట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. శీతాకాలం, వర్షాకాలాల్లో జిల్లాకు అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా కాగా వినియోగం అంతస్థాయిలో ఉండకపోవడంతో మిగులు కనబడుతోంది.
అయితే వేసవి కాలంలో డిమాండ్ పెరుగుతుండగా సరఫరా తగ్గుతుండడంతో కోతలు విధించడం అనివార్యమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరతే లేదని నిరంతర విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసే తేదీని కూడా ముందుగానే ప్రకటించేసింది. అయితే దీని అమలులో మాత్రం చిత్తశుద్ధి కొరవడి కొన్ని మండలాలకు మాత్రమే నిరంతర విద్యుత్ను పరిమితం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అత్యవసరమైతే తప్ప కోతలు ఉండవని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఫిబ్రవరి నెలలోనే కోతలుప్రారంభం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శాఖాధికారులు మాత్రం మరమ్మతుల కోసం అప్పుడప్పుడూ నిలుపుదల చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం విద్యుత్ ఆదా కోసం ఎల్ఈడీ బల్బులు ఇంటింటికీ పంపిణీ చేస్తామని ప్రకటించి ఆర్భాటంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పది రోజులు గడిచినా ఇప్పటికీ బల్బుల జాడ లేదు. ఇవి ఎప్పటికి వస్తాయో కూడా అధికారులకు సైతం తెలియడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేదొకటి...చేసేదొకటిగా ఉందని ఆవేదనతో అభిప్రాయపడుతున్నారు.
విషయాన్ని ట్రాన్స్కో ఎస్ఈ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కోతలకు సంబంధించి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. మరమ్మతుల కోసం అప్పుడప్పుడు సరఫరా ఆపుతుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఎల్ఈడీ బల్బులు త్వరలోనే జిల్లాకు పంపుతున్నట్లు సమాచారం వచ్చిందని అది ఖచ్చితంగా ఎప్పుడన్నది తనకు తెలియదన్నారు.