తెలంగాణ పోరాటయోధుడు లక్ష్మయ్య కన్నుమూత

తెలంగాణ పోరాటయోధుడు లక్ష్మయ్య కన్నుమూత


ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినెపల్లికి చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు పయ్యావుల లక్ష్మయ్య(87) అనారోగ్యంతో ఆదివారం ఖమ్మంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. సాయుధ పోరాటం, ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం, అనంతరం సీపీఎంలో కొనసాగిన ఆయన.. గోకినేపల్లి సర్పంచ్, టేకులపల్లి సొసైటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. పదిహేనేళ్ల వయస్సులోనే గ్రామంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడంతో పాటు పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు.

 

 దీంతో పోలీసులు ఆయనను.. బాలఖైదీగా పంపిస్తే శిక్ష తక్కువగా ఉంటుం దని భావించి 19ఏళ్ల యువకుడిగా నకిలీ ధ్రువపత్రం సృష్టించి నిజామాబాద్ జైలుకు పంపిచారు. ఏడాదిన్నరపాటు జైలు జీవితం గడిపిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకున్నారు. అనేక ఉద్యమాలు చేసిన పయ్యావుల జనజీవన స్రవంతిలో కలిసి పదేళ్లపాటు గోకినేపల్లి గ్రామ సర్పంచ్‌గా, టేకులపల్లి సహకార బ్యాంకు చైర్మన్‌గా రెండుదఫాలు ఎన్నికయ్యారు. ఆయన మృతికి సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top