నగరంలో కీచకుల పరంపర కొనసాగుతోంది. బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్: నగరంలో కీచకుల పరంపర కొనసాగుతోంది. బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకవైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్న అత్యాచార ఘటనలు ఆగడం లేదు. నిర్భయ, అభయ వంటి చట్టాలున్న కామాంధుల ఆగడాలకు కళ్లెం వెయ్యలేని పరిస్థితి నెలకొంది. ఇష్టారాజ్యంగా వీరు చిన్నారులపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కామాంధుల కబంధహస్తాలలో చిన్నారులు నలిగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా ఓ 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని యాలాల్ మండలం దౌలాపూర్లో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో బాలికపై జగదీష్ అనే వ్యక్తి ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ బాలిక ఇంటి ప్రక్కనే ఉంటున్న జగదీష్ రోజూ ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అత్త సాయంతో ఆ నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే కుటుంబీకులను చంపుతానని జగదీష్ బెదరించడంతో ఆ చిన్నారి భయపడి చెప్పలేదు. దీంతో ఆ బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భాన్ని దాల్చింది.
గత మూడు రోజులుగా బాలిక తీవ్ర కడుపునొప్పి అనడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు బాలిక గర్భవతిని చెప్పడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు. తన కూతురిపై జరిగిన ఈ ఘటనపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి అత్తను అరెస్టు చేశారు. నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పరారీలో నిందితుడు జగదీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.