బాధిత కుటుంబానికి పరామర్శ | Minister Taneti Vanitha Visit Molestation Victim in Prakasam | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి పరామర్శ

Dec 16 2019 1:11 PM | Updated on Dec 16 2019 1:11 PM

Minister Taneti Vanitha Visit Molestation Victim in Prakasam - Sakshi

కుటుంబానికి స్త్రీ శిశు సంక్షేమశాఖ నగదు చెక్కు అందిస్తున్న మంత్రులు

త్రిపురాంతకం: అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని యువతి కుటుంబాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలు ఆదివారం పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు ఏపీ దిశ 2019 చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. మంత్రి వనిత మాట్లాడుతు రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళల పట్ల జరుగుతున్న సంఘటనలు పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైన శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. పురుషులు రాత్రి  పనులకు వెళ్లిన సమయంలో ఏవిధంగా తమను ఏవిదంగా కాపాడుకోవాలి, పాఠశాలల్లో, కళాశాలలో చదువుకునే వారికి పురుషులు దాడులు వంటివి, ఇతరత్రా కాపాడుకునే విషయాలపై శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివరించారు.

ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, కార్యకర్తల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి తానేటి వనిత వివరించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు పడే విదంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి 21 రోజుల్లోనే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి  స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయలు ప్రకటించి ముందస్తుగా 25వేల రూపాయల చెక్కును అందించారు. వైఎస్సార్‌ సీసీ స్థానిక నాయకులు యాభైవేల రూపాయల నగదు సురేష్‌ చేతుల మీదుగా అందించారు. వీరి వెంట పీడీ విశాలాక్షి, ఆర్‌డీఓ శేషిరెడ్డి, తహసీల్దార్‌ జయపాల్, సీఐ మారుతీకృష్ణ, సూపర్‌వైజర్లు పద్మజ, రత్నం, పి. చంద్రమౌళిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement