భార్యాభర్తలు వేర్వేరు రాష్ట్రాలకు | IAS couples to posting for two different states | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలు వేర్వేరు రాష్ట్రాలకు

Aug 26 2014 3:02 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజనతో ఐఏఎస్‌ల్లోని నాలుగు జంటలను వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించారు. ప్రత్యూష్ సిన్హా తాత్కాలిక జాబితా ప్రకారం భార్య తెలంగాణ రాష్ట్రానికి వెళితే భర్త ఏపీకి వెళ్లారు.

* నాలుగు ఐఏఎస్ జంటలకు ఇదే పరిస్థితి
* ఒకే రాష్ట్రంలో ఉండేందుకు దరఖాస్తుకు గడువు ఈ నెల 29

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఐఏఎస్‌ల్లోని నాలుగు జంటలను వేర్వేరు రాష్ట్రాలకు కేటాయించారు. ప్రత్యూష్ సిన్హా తాత్కాలిక జాబితా ప్రకారం భార్య తెలంగాణ రాష్ట్రానికి వెళితే భర్త ఏపీకి వెళ్లారు. అలాగే భర్తను తెలంగాణకు కేటాయిస్తే భార్య ఏపీకి వెళ్లారు. స్పౌస్‌ను ఒకే రాష్ట్రానికి కేటాయించాలనే నిబంధన లేకున్నా ఈ ఐఏఎస్‌లు తామిద్దరినీ ఏదో ఒకే రాష్ట్రంలో ఉంచాలని కోరుతూ ఈ నెల 29వ తేదీలోగా ప్రత్యూష్ సిన్హా కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
 
 రాజీవ్‌రంజన్, వసుధామిశ్రాలు భార్యా భర్తలు. వీరిలో రాజీవ్ రంజన్ తెలంగాణకు, వసుధా ఏపీకి కేటాయించారు.ప్రస్తుతం ఏపీ సీఎంపేషీ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ సహానీని ఆంధ్రాకు, ఆయన భార్య నీలం సహానీని తెలంగాణకు కేటాయించారు. బీపీ ఆచార్యను తెలంగాణకు కేటాయించగా ఆయన భార్య రంజీవ్‌ఆర్ ఆచార్యను ఏపీకి కేటాయించారు.బీపీ ఆచార్య తెలంగాణ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆయన భార్యనూ తెలంగాణకే కేటాయించాల్సిందిగా కోరాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కేంద్రసర్వీసులో ఉన్న సీనియర్ అధికారి రెడ్డిసుబ్రహ్మణ్యం, ఆయన భార్య పుష్పా సుబ్రహ్మణ్యంలదీ ఇదే పరిస్థితి.
 
 ఎక్కువ మంది తెలంగాణకే ఆప్షన్లు
 డెరైక్ట్ రిక్రూటీల్లోని అఖిల భారత సర్వీసు అధికారుల్లో అత్యధికులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికే ఆప్షన్లు ఇచ్చారని ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో డెరైక్ట్ రిక్రూటీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు మొత్తం 126 మంది ఉండగా తెలంగాణలో పనిచేసేందుకు 68 మందిఆప్షన్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు మాత్రం కేవలం 37 మంది  అంగీకరించారు. మరో 21 మంది ఆప్షన్లను ఇవ్వలేదు.సిన్హా కమిటీ డెరైక్ట్ రిక్రూటీల్లో 71 మంది ఐఏఎస్‌లను ఆంధ్రాకు, 55 మందిని తెలంగాణకు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రంలో డెరైక్ట్ రిక్రూటీల్లో ఐపీఎస్‌లు 92 మంది ఉన్నారు.
 
 ఇందులో కూడా అత్యధికంగా 69 మంది ఐపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి ఆప్షన్లు ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడానికి కేవలం 17 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు. ఆరుగురు ఎక్కడా ఇవ్వలేదు. అయితే ప్రత్యూష్ సిన్హా కమిటీ వీరిలో 52 మంది ఐపీఎస్‌లను ఆంధ్రాకు, 40 మంది ఐపీఎస్‌లను తెలంగాణకు కేటాయించింది.ఉమ్మడి రాష్ట్రంలో డెరైక్ట్ రిక్రూటీల్లోని రాష్ట్రేతర ఐఎఫ్‌ఎస్‌లు 68 మంది ఉండగా అందులో ఆంధ్రాకు 43 మంది ఆప్షన్లు ఇవ్వగా తెలంగాణకు 21 మంది ఇచ్చారు.సిన్హా కమిటీ ఆంధ్రాకు 38 మంది ఐఎఫ్‌ఎస్‌లను, తెలంగాణకు 30 మందిని కేటాయించింది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లలో ఎక్కువమంది హైదరాబాద్‌లో స్థిరపడి ఉండటంవల్లనే ఎక్కువమంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement