హైదరాబాద్ విద్యార్థులపై అశనిపాతం | fear to Hyderabad on student | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ విద్యార్థులపై అశనిపాతం

Aug 26 2014 1:14 AM | Updated on Apr 7 2019 3:35 PM

ఉన్నత విద్య, సాంకేతిక, వృత్తి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటుపై రాష్ట్రప్రభుత్వం ఆదివారం జారీచేసిన మెమో హైదరాబాద్ విద్యార్థుల పాలిట అశనిపాతమైంది.

ఆర్టికల్ 371డి ప్రకారం రీయింబర్స్‌మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం మెమో
ఆందోళన వ్యక్తం చేస్తున్న హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర కుటుంబాలు
తమ పిల్లలకెవరు ఫీజులు చెల్లిస్తారని ఆందోళన
 

హైదరాబాద్: ఉన్నత విద్య, సాంకేతిక, వృత్తి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటుపై రాష్ట్రప్రభుత్వం ఆదివారం జారీచేసిన మెమో హైదరాబాద్ విద్యార్థుల పాలిట అశనిపాతమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో (286/ఈసీ/ఏ2/2014)పై వారు ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతిక, వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్టికల్ 371 డీ ప్రకారం స్థానికులైన విద్యార్ధులకే ఫీజులు చెల్లిస్తామని ఆ మెమోలో ప్రభుత్వం పేర్కొంది. ఆ ఆర్టికల్ ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి మధ్యలో వరుసగా నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదివితే అదే వారి స్థానిక ప్రాంతం అవుతుంది. ఆ లెక్కన కేవలం ఏపీలో చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఫీజుల చెల్లింపు ఉంటుందని ఈ మెమో ద్వారా ప్రభుత్వం తేటతెల్లం చేసింది. దీంతో ఉపాధి కోసం తెలంగాణ ప్రాంతంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో రెండు, మూడు దశాబ్దాలుగా ఉంటున్న కుటుం బాల పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మెమో ద్వారా నట్టేట ముంచుతోందని, ఇప్పుడు తమ పిల్లలకెవరు ఫీజులు చెల్లిస్తారని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పాత విద్యార్థుల పరిస్థితీ అయోమయమే..

కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకే కా కుండా ఆపై తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా ప్రభుత్వ నిర్ణయం అయోమయం నింపుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చేరుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుంది. వీరంతా ఏపీ స్థానికత ఉన్న వారు. తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనలో ఇప్పటి వరకు దాదాపు 60 వేల మంది పాల్గొన్నారు. వీరిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు 20 వేల మంది ఉంటారని అంచనా. వీరి ఫీజుల చెల్లింపు తమ బాధ్యత కాదని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ చెబుతున్నాయి. ఇక ఇప్పటికే రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు చదువుతున్న వి ద్యార్థులు (తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల పిల్లలు) దాదాపు లక్ష మంది వరకు ఉంటారని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు ఆధారంగా కాలేజీల్లో చేరి చదువులు కొనసాగిస్తున్న వీరు తక్కిన సంవత్సరాలకు ఫీజులు చెల్లించే మార్గం కానరాక ఆందోళన చెందుతున్నా రు. ఇది కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి మా త్రమే. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంటులతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్న ఎంసీఏ, ఎంబీఏ, బీఫార్మసీ, పాలిటెక్నిక్, డీఫార్మసీ, డిగ్రీ కోర్సుల విద్యార్ధులూ ప్రభుత్వ మెమోతో రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement