పాలనా ప్రహసనం.. ముగిసింది | ex mla | Sakshi
Sakshi News home page

పాలనా ప్రహసనం.. ముగిసింది

Mar 1 2014 2:36 AM | Updated on Sep 2 2017 4:12 AM

పాలనా ప్రహసనం..  ముగిసింది

పాలనా ప్రహసనం.. ముగిసింది

అనూహ్య పరిస్థితుల్లో శాసనసభ స్తుప్తాచేతనావస్థలోకి జారుకుంది. రాష్ట్రపాలన రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లిపోయింది. మంత్రులు మాజీలయ్యారు.

 అనూహ్య పరిస్థితుల్లో శాసనసభ స్తుప్తాచేతనావస్థలోకి జారుకుంది. రాష్ట్రపాలన రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లిపోయింది. మంత్రులు మాజీలయ్యారు.

 

త్వరలో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో గత ఐదేళ్లలో మన ప్రజాప్రతినిధులు.. ముఖ్యంగా అధికార భోగాలను అనుభవించిన మంత్రి పుంగవులు జిల్లాకు ఏం చేశారని ఒక్కసారి వెనుదిరిగి చూస్తే.. ఒక్క ధర్మానను మినహాయిస్తే.. మిగతావారు చెప్పుకొనేందుకు ఏమున్నది గర్వకారణం.. అంతా నిరాశే తప్ప.. అన్న నిట్టూర్పే మిగులుతుంది. పక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన శత్రుచర్ల.. రాజాంకు మారి రాజయోగం అబ్బిన కోండ్రు జిల్లాకు చేసింది శూన్యమేనని చెప్పకతప్పదు.
 
 :

కోటి ఆశలతో ఆరంభం.. అంతలోనే మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం.. దిశా నిర్దేశం లేని ప్రభుత్వాలు.. ప్రజల బాగోగు లు పట్టని మంత్రులు.. ఇవి చాలవన్నట్లు తెలుగుజాతిని చీల్చిన విభజన చిచ్చు... చివరికి రాష్ట్రపతి పాలనలోకి వెళ్లడంతో ప్రస్తుత అసెంబ్లీ ప్రస్థానం ముగిసింది. ప్రహసనప్రాయంగా మారిన పాలనకు తెరపడింది. 2009లో కాంగ్రెస్‌కు ప్రజలు కట్టబెట్టిన అధికారం బూడిదలో పోసిన పన్నీరైంది. జిల్లాకు ఇది చేశామని చెప్పుకోవడానికి కూడా లేని దుస్థితిలో రాష్ట్ర మంత్రులు డమ్మీలైపోయారు.

 

వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. 2009 ఎన్నికల్లో ప్రజల తీర్పు సారంశం ఒక్కటే. 2004-09లో సంక్షేమ రాజ్యాన్ని అందించిన వైఎస్‌ను మళ్లీ సీఎం చేయడమే. అందుకే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏకంగా 9 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజలు ఆశించిన విధంగానే వై.ఎస్. సీఎం అయ్యారు కానీ విధి వక్రీకరించింది. రెండోసారి అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం చెందారు. పిడుగుపాటులాంటి ఈ దుర్ఘటన జిల్లా ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది.

 

 మంత్రులు ముగ్గురు.. ప్రగతి పిడికెడే!
 2009-14 మధ్య కాలంలో జిల్లా నుం చి ముగ్గురు ప్రతినిధులు రాష్ట్ర మంత్రులుగా చేశారు.  వై.ఎస్. మూడు నెలల పాలనను మినహాయిస్తే మిగిలిన పరిపాలనా కాలమంతా మాటలతోనే కాలక్షేపం చేశారని చెప్పొచ్చు. ఈ కాలంలో జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్‌లు మంత్రులుగా చేశారు. వీరిలో ధర్మాన చాలావరకు నయం. శత్రుచర్ల, కోండ్రు మురళీలు పూర్తిగా విఫలమయ్యారు.
 దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం
 -ధర్మాన ఎంతో నయం
 వైఎస్ ప్రభుత్వంలో చూపించిన జోరును కొనసాగించకపోయినా.. తనకున్న అనుభవంతో,  నిధులు రప్పించే సామర్థ్యంతో కొంతవరకు నెట్టుకువచ్చారు. రోశయ్య ప్రభుత్వంలో కూడా ధర్మాన రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. ఈ సమయంలోనే అరసవల్లిలో టీటీడీ కల్యాణ మండపం, పర్యాటక శాఖ బడ్జెట్ హోటల్‌ను మంజూరు చేయించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ధర్మాన ప్రభ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఆయనను కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి తప్పించి ఆర్ అండ్ బి శాఖ కేటాయించారు. ఈ శాఖ మంత్రిగా ధర్మాన జిల్లాకు ఏకంగా మూడు ప్రధాన వంతెనలు మంజూరు చేయించారు. జిల్లా కేంద్ర ప్రజల చిరకాల కోరిక అయిన పొన్నాడ వంతెన దాదాపు పూర్తి కావచ్చింది. శ్రీకాకుళం పాత వంతెన స్థానంలో  కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదే విధంగా పాదయాత్రలో వైఎస్ ఇచ్చిన హామీని ఆచరణలోకి తీసుకువచ్చారు. జలుమూరు మండలం కొమ్మనాపల్లి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఇక జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో రోడ్లకు మహర్దశ కలిగిందనే చెప్పాలి. కళింగ రోడ్డు, జీటీ రోడ్డు, జెడ్పీ రోడ్లను విస్తరించారు. అరసవల్లి జంక్షన్ నుంచి కలెక్టరేట్‌కు 80 అడుగుల రహదారి నిర్మించారు. నవభారత్ జంక్షన్ నుంచి పాతవంతెన, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా పెద్దపాడు వరకు ప్రధాన రహదారిని విస్తరించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని వేధించేందుకు  కాంగ్రెస్ అధిష్టానం పన్నిన కుట్రలో ధర్మాన కూడా బాధితుడయ్యారు. సీబీఐ చార్జిషీట్‌లో తన పేరును కూడా చేర్చడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్రమంగా తనను ముద్దాయిని చేసిన కాంగ్రెస్‌లో కొనసాగలేనని చెప్పి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.
 హోదాకే మంత్రి
 - శత్రుచర్ల తీరు ఇదీ!
 ‘ఆరో వేలు’ మాదిరిగా మారిపోయింది మంత్రి శత్రుచర్ల వ్యవహారం. ఆయన మంత్రి అనే విషయాన్నే ప్రజలు పెద్దగా గుర్తించలేదనే చెప్పొచ్చు.  రోశయ్య ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పని చేసిన ఈ ఐదేళ్లలో ఆయన  అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన సందర్భం దాదాపు లేదనేది విస్మయకర వాస్తవం. ఒక్కసారి కూడా ఉన్నతాధికారులతో తన శాఖ వ్యవహారాలుగానీ, జిల్లా ప్రగతి గురించి కనీసం చర్చించలేదు. డీఆర్సీ వంటి సమావేశాలకు మొక్కుబడిగా హాజరుకావడం మినహా అధికార కార్యక్రమాలను ఏమాత్రం పట్టించుకోలేదు. తన నియోజకవర్గమైన పాతపట్నానికే ఎప్పుడోగానీ వచ్చేవారు కాదు. వచ్చిన సందర్భాల్లో కూడా చిన్న చిన్న కార్యక్రమాలకే పరిమితమయ్యేవారు.  ఇక జిల్లా కేంద్రానికి ఆయన వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్కెట్టొచ్చు. వరుసగా వారం రోజులు ఎప్పుడూ జిల్లాలో లేని ఆయనకు చెప్పుకోవడానికి ఇంకేముంటుంది!
 ఆత్రం.. ఆరాటం... ఆచరణ శూన్యం
 - ఇదీ కోండ్రు కథ
 మంత్రి కావాలన్న రాజకీయ లక్ష్యాన్ని సాధించిన కోండ్రు మురళీ జిల్లాకు చేసింది మాత్రం ఏమీ లేదు. కిరణ్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రియో గం ప్రాప్తించింది. కీలకమైన వైద్యవిద్య, ఆరోగ్యశ్రీ, 108,104 శాఖలను  కేటాయించారు. మంత్రి హోదాను తన రాజకీయహంగు, ఆర్భాటాలకే ఆయన వినియోగించుకున్నారన్న విమర్శలున్నాయి. జిల్లాలో రిమ్స్ సమస్యల పరిష్కారంపై కూడా ఆయన దృష్టి పెట్టలేదు. అదనపు సీట్లు ఆశించిన రీతిలో సాధించలేదు. రిమ్స్ విస్తరణ పూర్తికాలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సేవలు పడకేశాయి. ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ రెండు సేవలు నిర్వీర్యం కావడం ఆయన వైఫల్యమేనని చెప్పొచ్చు. పేదల ప్రజల సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం కోండ్రు హయాంలో నీరుగారిపోయిం ది.  దాదాపు 133 రోగాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తప్పిం చింది. తన నియోజకవర్గం రాజాంకు కూడా కోండ్రు చేసిందేమీ లేదు. కీలకమైన రాజాం రైల్వే లైన్‌ను సాధించలేకపోయారు. పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచిన రాజాంలో కొత్త ప్రాజెక్టులు తేలేకపోయారు. వెరసి జిల్లా మంత్రుల పదవీకాలం నిరాశాజనకంగా ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ప్రగతి పడకేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement