విత్తనోత్పత్తి చేసుకోవాలి: సుదర్శన్‌రెడ్డి | Don't depend on import seeds from other states, says Sudarshan reddy | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తి చేసుకోవాలి: సుదర్శన్‌రెడ్డి

Nov 8 2013 4:54 AM | Updated on Sep 2 2017 12:23 AM

ఇతర రాష్ట్రాల నుంచి సోయాబిన్ విత్తనాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇక్కడే విత్తనోత్పత్తి చేసుకోవడం ఉత్తమమని మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆర్మూర్ టౌన్/ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్ : ఇతర రాష్ట్రాల నుంచి సోయాబిన్ విత్తనాలను దిగుమతి చేసుకోవడం కంటే ఇక్కడే విత్తనోత్పత్తి చేసుకోవడం ఉత్తమమని మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌లోని ఏపీ సీడ్స్ గోదాంలో ఏర్పాటు చేసిన సోయాబిన్ విత్తన శుద్ధి యంత్రాన్ని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కలెక్టర్ పీఎస్ ప్రద్యు మ్న, జేసీ హర్షవర్ధన్‌లతో కలిసి ఆయన గురువారం పరి శీలించారు. అంకాపూర్‌లోని గురడిరెడ్డి సంఘంలో రైతులతో సమావేశమయ్యారు. కార్యక్రమాల్లో మంత్రి మా ట్లాడుతూ జిల్లాలోని రైతులు సోయాబిన్ విత్తనోత్పత్తి చేయడానికి ముందుకు రావాలన్నారు. ఉన్నతాధికారుల తో మాట్లాడి ఆర్మూర్, బోధన్‌లలో శుద్ధి యంత్రం, గోదాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 108 గ్రామాల్లోనే రైతులు ఎర్రజొన్న పండిస్తారని, సీడ్ వ్యాపారులు డబ్బులు చెల్లించడంలో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించే ఎర్రజొన్నల టెండర్లలో రైతులు పాల్గొనేలా చూస్తానన్నారు.
 
 రూద్రూర్‌లోని సోయా మూల విత్తనాలతో 2011-12లో ఆర్మూర్‌లోని ఏపీ సీడ్స్‌లో సోయా విత్తనోత్పత్తి ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పినట్లు పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి చెప్పారు. గతేడాది 1,200 క్వింటాళ్ల సోయా విత్తనాలను, ఈ ఏడాది 2 వేల క్వింటాళ్ల విత్తనాలను శుద్ధి చేశామన్నారు. మన విత్తనాలతో అధిక దిగుబడి రాదన్న అపోహ రైతుల్లో ఉందన్నారు. వాస్తవానికి రుద్రూర్ పరిశోధనశాలలోని మూల విత్తనాలను మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లి విత్తనశుద్ధి చేసి, మనకే విక్రయిస్తున్నారన్నారు. ఈ యూనిట్‌లో రెండు మూడేళ్లలో పెద్ద ఎత్తున విత్తనశుద్ధి చేస్తామన్నారు.  జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు అవసరమని గుర్తించామని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. ఆర్మూర్‌లో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులను నిర్మించడానికి స్థలాన్ని కేటాయించి, నెల రోజులలో మంజూరు వచ్చేలా కృషి చేస్తానన్నారు.
 
 బోధన్‌లో..
 బోధన్ రూరల్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకుగాను బోధన్ డివిజన్‌లో రెండుచోట్ల విత్తనోత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం బోధన్ మార్కెట్ కమిటీలో విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్‌లో, బిచ్కుంద లేదా జుక్కల్ ప్రాంతాలలో సుమారు రూ. 30 లక్షలతో విత్తనశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement