గిరిజనుల ప్రయోజనాలు కాపాడతాం | CM YS Jagan referred to Advocate General | Sakshi
Sakshi News home page

గిరిజనుల ప్రయోజనాలు కాపాడతాం

May 11 2020 4:10 AM | Updated on May 11 2020 5:07 AM

CM YS Jagan referred to Advocate General - Sakshi

సాక్షి, అమరావతి: గిరిజనుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్వొకేట్‌ జనరల్‌తో ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసంలో సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో టీచర్‌ పోస్టుల్లో ఎస్టీలకు నూరు శాతం రిజర్వేషన్లపై న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేయాలని అడ్వొకేట్‌ జనరల్‌కు సూచించారు సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 

► గిరిజన ప్రాంతాల్లోని టీచర్‌ పోస్టుల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 3ను జారీ చేశారు. ఈ జీవోను కొట్టేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 
► జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన గిరిజన వర్గాల్లో నెలకొందని తెలిపారు.  
► ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించిన ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌తో సమీక్షించి గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
► న్యాయస్థానం తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని పేర్కొన్నారు. 
► ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కాబట్టి తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  

Advertisement
 
Advertisement
Advertisement