వైఎస్సార్‌ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం | వైఎస్ జగన్‌ | ఏపీ చరిత్రలో అరుదైన ఘట్టం - Sakshi
Sakshi News home page

ఏపీ చరిత్రలో అరుదైన ఘట్టం

Published Mon, Sep 30 2019 8:43 AM

CM Jagan To Offers Silk Clothes To Tirumala - Sakshi

టీటీడీ చరిత్రలోనే అరుదైన ఘట్టం సోమవారం ఆవిష్కృతమవుతోంది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం వైఎస్సార్‌ కుటుంబానికి దక్కబోతోంది. ముఖ్యమంత్రి హోదాలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పించే అద్భుత ఘట్టం. ఆ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

సాక్షి, అమరావతి : టీటీడీ చరిత్రలో వైఎస్సార్‌ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కనుంది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కనుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో తండ్రి, తనయులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకుముందెప్పుడు జరగలేదు. తిరుమల వెంకటేశుని ఆశీస్సులతో వైఎస్‌ కుటుంబానికే ఈ గౌరవం దక్కింది. 

శ్రీవారిపై వైఎస్సార్‌ కుటుంబానికి అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించడానికి ముందు, దిగ్విజయంగా పాదయాత్ర పూర్తయిన తర్వాత వెంకన్నను కాలినడకను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రా సమర్పించనున్నారు. 

బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్ర్తంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్ర్తాలు తీసుకెళ్తారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించి, గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement