బీజేపీ గూటికి ‘చాగన్ల’ | Sakshi
Sakshi News home page

బీజేపీ గూటికి ‘చాగన్ల’

Published Wed, Dec 25 2013 12:02 AM

chaganla narendranath joined in bharatiya janata party

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:   కాంగ్రెస్ నాయకుడు చాగన్ల నరేంద్రనాథ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నరేంద్రనాథ్‌కు పార్టీ కండువాను కప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి కలిసితో నరేంద్రనాథ్ దంపతులు మంగళవారం ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామనే రాజ్‌నాథ్ హామీ మేరకు నరేంద్రనాథ్ బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో మెదక్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో నరేంద్రనాథ్ ఉన్నారు. పార్టీ జాతీయ నాయకులు ఈ సభకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో నరేంద్రనాథ్ 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయాలకు కొత్త అయిన నరేంద్రనాథ్ స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయశాంతి చేతిలో ఓటమి పాలయ్యారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని  పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ జిల్లా నేతలు నరేంద్రనాథ్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలోనే నరేంద్రనాథ్ బీజేపీ గూటికి చేరారు.

Advertisement
Advertisement