పెన్నా బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులపై విజిలెన్స్ విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల ...
నెల్లూరు(బృందావనం): పెన్నా బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులపై విజిలెన్స్ విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. పెన్నానది వద్ద ప్రారంభమయ్యే సర్వేపల్లి కాలువ రక్షణ గోడను ఎందుకు ధ్వంసం చేశారో.. బ్యారేజీ వద్ద షట్టర్లపై ఇసుక బస్తాలను ఎందుకు వేశారో.. సర్వేపల్లి కాలువలోని నీళ్లను పెన్నానదిలోకి ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ఈ పనుల్లో అవినీతి ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను పత్రికలకు అందజేశారు.
135 ఏళ్ల క్రితం నిర్మితమైన రక్షణగోడను కూల్చేందుకు ఎలాంటి అనుమతుల్లేవని, కాసుల కోసం గోడను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. సోమశిలలో నీరు ఉండగా పెన్నా బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలతో నిల్వచేసే ఆవశ్యకతలేదన్నారు. నీటిని మోటార్ల ద్వారా లిఫ్ట్ చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వివరించారు.