దళిత, గిరిజనులపై పెరిగిన దాడులు | Attacks on Dalit and Tribals in TDP govt | Sakshi
Sakshi News home page

దళిత, గిరిజనులపై పెరిగిన దాడులు

Nov 21 2017 9:22 AM | Updated on Aug 10 2018 6:21 PM

చీరాల టౌన్‌: ‘గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది. తనను వేధించి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని రోడ్డెక్కిన గిరిజన జెడ్పీటీసీ సభ్యురాలి దీక్షను బలవంతంగా పోలీసులు భగ్నం చేయడం దారుణం. నియోజకవర్గంలో నియంతపాలన సాగిస్తున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అరాచకాలు అడ్డుకుంటాం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ సమన్వయకర్త వరికూటి అమృతపాణి అన్నారు. వేటపాలెం జెడ్పీటీసీ సభ్యురాలు కొమరగిరి విజయను వేధించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 

అఖి లపక్షం నాయకుడు గోసాల అశీర్వాదం అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు పలు ప్రజా, కుల, రాజకీయ పార్టీలు, కుల నిర్మూలన సమితి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన డాక్టర్‌ అమృతపాణి మాట్లాడుతూ గిరి జన ప్రజాప్రతినిధిపై ఎమ్మెల్యే, అతని అనుచరులు అవలంబిస్తున్న విధానాలు బాధాకరమరన్నారు. జెడ్పీటీసీకి కేటాయించిన రూ.30 లక్షల నిధులను ఆమెకు తెలియకుండా ఖర్చు చేసుకోవడంతో పాటు ఆమె దీక్షను భగ్నం చేసి ఏరియా వైద్యశాలకు తరలించడం అన్యాయమన్నారు. జెడ్పీటీసీ తన తప్పును ఒప్పుకుని ఎమ్మెల్యేకు సాగిలపడి క్షమాపణలు చెప్పాలని, లేకుంటే కుల బహిష్కరిస్తామని ప్రకటించడం చట్టాలను అతిక్రమించడమేనని, కులం నుంచి బహిష్కరించే హక్కు ఎవరికీ లేదని, ఆ వాఖ్యలు చేసిన వారిపై అట్రా సిటీ కేసు నమోదు చేసి ఖఠినంగా శిక్షిం చాలని అమృతపాణి డిమాండ్‌ చేశారు. దళిత ఎంపీ శీరాం మాల్యాద్రిపై అక్కసుతో ఎమ్మెల్యే ఆమంచి రూ.1.45 కోట్ల ఎంపీ నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం దారుణమన్నారు. 

గిరిజన జెడ్పీటీసీ నిధులు అక్రమంగా వినియోగించడంతో పాటు ప్రొటోకాల్‌ ను విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొమరగిరి విజయకు న్యాయం చేసే వరకు ఆమెకు అండగా ఉంటామన్నారు.  విజయ మాట్లాడుతూ తన మండలం లో అభివృద్ధి పనులకు జడ్పీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయిస్తే తనకు తెలియకుండా వేటపాలెం సర్పంచ్, ఇత ర నాయకులు ఖర్చు చేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. అధికార పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి జెడ్పీటీసీగా తాను విజయం సాధించానని, ఒక పార్టీపై గెలిచి మరొక పార్టీలోకి తాను వెళ్లలేదని పరోక్షంగా ఎమ్మెల్యే ఆమంచిని ఉద్దేశిం చి వ్యాఖ్యానించారు. 

నిధుల వినియోగాలకు సంబంధించి తనకు తీర్మానాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనకు జరిగిన అన్యాయాన్ని జెడ్పీ చైర్మన్‌కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాలను సీఎంకు వివరిస్తానని విజయ పేర్కొన్నారు. అనంతరం పలు ప్రజాసంఘాల నాయకులు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఎంపీపీ జి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు కట్టా గంగయ్య, ప్రజా, కుల సంఘాల నాయకులు కుంచాల పుల్లయ్య, ఎన్‌.మోహన్‌కుమార్‌ ధర్మా,  గుమ్మడి ఏసురత్నం, పొదిలి ఐస్వామి, పి.రాజు, చుండూరు వాసు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement