రాజధాని నగరంలో సమైక్య సభకు అనుమతివ్వడం ద్వారా హైదరాబాద్లో ఘర్షణలు సృష్టించేందుకు, ఆ సాకుతో తెలంగాణ ఏర్పాటును జాప్యం చేయించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో సమైక్య సభకు అనుమతివ్వడం ద్వారా హైదరాబాద్లో ఘర్షణలు సృష్టించేందుకు, ఆ సాకుతో తెలంగాణ ఏర్పాటును జాప్యం చేయించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ధ్వజమెత్తారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణ జేఏసీ తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతించకుండా ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం పూర్తిగా వివక్షేనన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్కుమార్రెడ్డి నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కిరణ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ధోరణి హైదరాబాద్లో ఘర్షణలు రెచ్చగొట్టేలా ఉంది. ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడం... సీఎం తన సభకు తానే అనుమతినిచ్చుకున్నట్టుగా ఉంది’’ అంటూ తూర్పారబట్టారు.
కిరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఏర్పాటును ఆపడం ఆయన తరం కాదన్నారు. ఆయన కుట్రకు తెలంగాణ ప్రజలు ఎదరొడ్డి నిలుస్తారన్నారు. 7వ తేదీన హైదరాబాద్లో ఎలాంటి పరిణామాలు తలెత్తినా దానికి సీఎంతో పాటు, తెలంగాణ మంత్రుల కూడా బాధ్యులవుతారని హెచ్చరించారు. బుధవారం మంత్రి జానారెడ్డిని, డీజీపీ వి.దినేశ్రెడ్డిని కలిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అనుమతివ్వకపోయినా 7న శాంతి ర్యాలీ స్థానంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి తీరతామని ప్రకటించారు. ‘‘ఏ కార్యక్రమం నిర్వహించాలనేదీ గురువారం సమావేశమై నిర్ణయిస్తాం. దాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోల సభ సందర్భంగా ఏదైనా జరిగితే డీజీపీ, సీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
ఒక శక్తి డీజీపీ, సీపీలను ఆడిస్తోంది: ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడం వెనుక డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మలను ఒక బలమైన శక్తి వెనక నుంచి ఆడిస్తోందని కోదండరాం ఆరోపించారు. ‘‘రాజకీయ ఒత్తిళ్ల వల్లే పోలీసులు ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిచ్చారు. హైదరాబాద్ విషయంలో రాజకీయ కుట్ర జరుగుతోంది. ప్రభుత్వమంతా ఒక వైపున ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తోంది. మా శాంతి ర్యాలీకి అనుమతివ్వకుండా ఏపీఎన్జీవో సభకు అనుమతివ్వడంపై డీజీపీని కలసి నిరసన తెలిపాం.
పోలీసుల వివక్షపై ఆయనకు ఫిర్యాదు చేశాం. సకల జనుల సమ్మె సందర్భంగా మేం సాగర హారానికి అనుమతి కోరితే వేధించారు. ఆర్టీసీ సమ్మెకు డిపోల వద్దకు వెళ్తే అరెస్టు చేశారు. ఇప్పుడు మాత్రం ఏపీ ఎన్జీవోల సభకు ముందుగానే అనుమతివ్వడం తెలంగాణ వారిని అవమానించడమే. కిరణ్ చర్యలు హనుమంతుని కుప్పిగంతులే. అవి తెలంగాణ ప్రజల ఎదుట సాగబోవు. విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతకంటే అనర్థం ఉండబోదనేందుకు హిట్లర్, ముస్సోలినీలే ఉదాహరణ’’ అన్నారు. తెలంగాణ పౌరులుగా సొంత గడ్డపై ర్యాలీ నిర్వహించుకునే హక్కు కూడా తమకు లేదా? అని శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోల సభలో అసాంఘిక శక్తులను చేర్చి, అల్లర్లు సృష్టించి, తద్వారా ఇక్కడున్న వారికి భద్రత లేదనే అపోహ కల్పించే కుట్ర జరుగుతోందన్నారు.
హైదరాబాద్లో ఉంటున్న వివిధ ప్రాంతాల వారి భయాందోళనలు పోగొట్టేందుకు తలపెట్టిన శాంతి ర్యాలీని అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు. అంతకుముందు జానారెడ్డి సచివాలయంలో తన చాంబర్లో తెలంగాణ జేఏసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాగా, సమావేశంతో పేరుతో ఏపీ ఎన్జీవోలే శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, తెలంగాణ వారిపైకి నెట్టే అవకాశముందని తెలంగాణ జేఏసీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. అందుకు పోలీసులు, కమిషనర్, డీజీపీ, సీఎంలదే బాధ్యతని హెచ్చరించారు. తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించి, ఏపీ ఎన్జీవోల సభకు అనుమతివ్వడంపై ఐదు జేఏసీల నేతలు బుధవారం సీపీ అనురాగ్ శర్మను కలసి నిరసన తెలిపారు. కాగా, 7న హింసను ప్రేరేపించి, ఆ సాకుతో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగానో, మరోవిధంగానో ప్రకటించేలా చేసే కుట్ర జరుగుతోందని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు ఆరోపించారు. సీఎం, డీజీపీ, సీపీలే దీన్ని ముందుండి నడిపిస్తున్నారన్నారు.