ఫిబ్రవరి 27 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు
షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలో విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ప్ర«థమ, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 10,06,449 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతన్నారన్నారు. వీరిలో 5,25,729 మంది ప్రథమ, 4,80,720 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,448 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్షలు జనవరి 28న, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు