దేశంలోనే అగ్రగామి.. ఏపీఎస్‌ ఆర్టీసీ   | After Lockdown APSRTC Leading In Country, says AbhiBus | Sakshi
Sakshi News home page

దేశంలోనే అగ్రగామి.. ఏపీఎస్‌ ఆర్టీసీ  

Jun 17 2020 10:13 AM | Updated on Jun 17 2020 11:40 AM

After Lockdown APSRTC Leading In Country, says AbhiBus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ప్రారంభమైన ప్రజా రవాణా సదుపాయాలలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థగా అగ్రగామిగా నిలిచినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌ అభిబస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అన్‌లాక్‌ 0.1 ప్రారంభమైన తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులలో 70 శాతం టికెట్‌లు బుక్‌ అయినట్లు సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌శర్మ వెల్లడించారు. కరోనా మహమ్మారి కంటే ముందు సాధారణ రోజుల్లో ఉన్న టికెట్‌ బుకింగ్‌ల కంటే ఇది ఎక్కువేనని పేర్కొన్నారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు)

వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థలపై జరిపిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైనట్లు చెప్పారు. 6090 బస్సులతో 137 నగరాలకు, పట్టణాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పిస్తోందన్నారు. మరో 1,445 ప్రైవేట్‌ బస్సులు కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నుంచి 596 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, వైజాగ్‌ నుంచి 383, నెల్లూరు నుంచి 226 అంతర్రాష్ట్ర  రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 1218 బస్సులు 45 నగరాలకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువగా ఢిల్లీ–లక్నోల మధ్య నడుస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement