కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 71వ ర్యాంకర్ అష్మిత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ 51వ ర్యాంకర్ మాళవికæ, 38వ ర్యాంకర్ దేవిక సిహాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అష్మిత 21–13, 21–16తోగో జిన్ వె (మలేసియా)పై గెలిచింది.
మాళవిక 21–16, 8–21, 15–21తో లినె హొమార్క్ జార్స్ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో, దేవిక 16–21, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ ప్లేయర్ కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 25–27తో ప్రెస్లీ స్మిత్–జెనీ గాయ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) 14–21, 15–21తో హు కె యువాన్–లిన్ జియాంగ్ యి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.


