
ఇల్లు ఇప్పించండి సారూ..
చందంపేట : అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. గత ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూం ఇళ్లు తమకు వస్తాయని అనుకుంటే డ్రాలో వీరి పేరు రాలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లు అయినా వస్తాయి అనుకుంటే జాబితాలో ఆ నిరుపేద కుటుంబాల పేర్లు లేకుండా పోయాయి. చందంపేట మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల యశోద–ఎల్లయ్య దంపతులకు నలుగురు కుమారులు. ఇందులో ముగ్గురికి వివాహం కాగా వారికి 8 మంది సంతానం. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రెండు గదుల స్లాబ్, రెండు గదుల రేకులతో కూడిన ఇంట్లో నివాసం ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులుగా గుర్తించినప్పటికీ డ్రాలో వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని ఆశించారు. కానీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో వీరి పేరు లేదు. ముగ్గురు అన్నదమ్ములకు వేర్వేరుగా తెల్ల రేషన్కార్డులు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో వీరి పేరు లేదు. ఇంతమంది ఒకే ఇంట్లో ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కనికరించి తమకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు.
ఒకే ఇంట్లో 16 మంది నివాసం
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో లేని నిరుపేదల పేర్లు
ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
నాకు నలుగురు కొడుకులు. అందులో ముగ్గురు కొడుకలకు పెళ్లి అయ్యింది. ఆ ముగ్గురు కొడుకులకు కలిపి 8 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం 16 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. మా కొడుకులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం నా భర్త చనిపోతే నేను కూలి పనికి పోయి జీవిస్తున్నా. ఇప్పుడున్న ప్రభుత్వం నా కుమారులకు ఇళ్లను కేటాయించాలి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో మా కుమారుల పేర్లు లేవు. అధికారులు కనికరించి ఇళ్లు కేటాయించాలి. – ఇరగదిండ్ల యశోద

ఇల్లు ఇప్పించండి సారూ..