
రేణుకా ఎల్లమ్మకు అభిషేకాలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించారు. అర్చకులు అమ్మవారికి హారతి ఇచ్చారు.
సఖి కేంద్రం తనిఖీ
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ ఉమాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం అందించే సేవలు, కేంద్రంలో నమోదవుతున్న కేసుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సిబ్బందికి సూచించారు. అవసరమైతే మహిళా కమిషన్ సహాయాన్ని కూడా కోరవచ్చని సిబ్బందికి తెలిపారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సఖీ సిబ్బంది వరుణ శ్రీ, సునీత, గీత, నాగమణి ఉన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీగా శేఖర్రెడ్డి
నల్లగొండ: ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీగా డీఆర్డీఓ శేఖర్రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన మాన్యనాయక్ గత నెల 30న పదవీ విరమణ చేశారు.
13న పాలిసెట్
ఎంట్రెన్స్ పరీక్ష
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్–2025 ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్. నరసింహారావు తెలిపారు. మొత్తం 5203 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలన్నారు. ఒక నిమిషం నిబంధన వర్తిస్తుందని, 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని వివరించారు. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు హెచ్బీ పెన్సిల్, బ్లూ, బ్లాక్ బాల్పెన్, ఎరైజర్, రైటింగ్ ప్యాడ్ తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలన్నారు.
ఇన్చార్జ్ సీపీఓగా సామ్యేల్
నల్లగొండ: భువనగిరి సీపీఓ సామ్యేల్కు నల్ల గొండ ఇన్చార్జ్ సీపీఓగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సామ్యేల్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు. కాగా నల్లగొండ సీపీఓగా పనిచేసిన మాన్యనాయక్ గత నెల 30న పదవీ విరమణ చేశారు.
శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● డీఈఓ భిక్షపతి
తిప్పర్తి : విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, స్పీడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ విద్య, సాంస్క్రతిక కార్యక్రమాలు, పెయింటింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తారని తెలిపారు. వివిధ కస్తూరిబా పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థినులు ఈ శిక్షణలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు శిక్షణ శిబిరం జరుగనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జీఈసీఓ అరుంధతి, ఎంఈఓ నర్సింహనాయక్, ఎస్ఓ రాజరాజేశ్వరీ ఉన్నారు.

రేణుకా ఎల్లమ్మకు అభిషేకాలు