ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండీ మిత్ర వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యారడైజ్ బిర్యానీ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. వచ్చే మూడేళ్లలో కొత్తగా 100 ఔట్లెట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండీ అభీక్ మిత్ర వెల్లడించారు. తొలి దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ, తదుపరి దశల్లో ముంబై, పుణె, ఢిల్లీ నగరాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 57 ఔట్లెట్స్ ఉన్నాయి.
విస్తరణ కోసం వచ్చే ఆరు నెలల్లో రూ. 100 కోట్లు సమీకరిస్తున్నట్లు సంస్థ ప్రమోటర్ అయిన సమారా క్యాపిటల్ ఎండీ నిలయ్ ప్రతీక్ తెలిపారు. ఇందులో సుమారు 50 శాతాన్ని తాము సమకూర్చనుండగా, మరో 40–50 శాతాన్ని బైటి నుంచి సేకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఔట్లెట్స్ విస్తరణ, కొత్త ఔట్లెట్స్ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో సుమారు రూ. 520 కోట్ల ఆదాయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం సుమారు రూ. 300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.


