టెక్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మెటా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ప్రభావం 8000 ఉద్యోగులపై పడింది. మరో 7000 మంది ఉద్యోగులను కొత్త టీమ్స్కు మార్చింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 6000 పోస్టులను కూడా భర్తీ చేసే యోచన లేదని సంస్థ స్పష్టం చేసింది.
ఈ పరిణామాల తరువాత మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అందులో.. ఈ ఏడాది పెద్ద స్థాయి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఉద్యోగ కోతల తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.
మార్క్ జుకర్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా వివరించారు. కంపెనీ కమ్యూనికేషన్ విషయంలో కొంత స్పష్టత లోపించిందని ఆయన అంగీకరించారు. ఉద్యోగులకు సరైన సమాచారం ఇవ్వడంలో మరింత మెరుగుదల అవసరం ఉందని చెప్పారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు. సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, కంపెనీలు నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏఐను మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు.
ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థ 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు. యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి దాదాపు ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.


