మ్యూచువల్ ఫండ్స్ వాటాల్లో కోత
ఐటీ షేర్లలో పెట్టుబడులు
8 ఏళ్ల కనిష్టానికి క్రాష్...
వృద్ధి, ఏఐపై ఆందోళనల ఎఫెక్ట్
12 నెలల్లో ఫండ్స్ వాటా 1.8% డౌన్
రెండు దశాబ్దాలుగా అటు ఉపాధి కల్పనలోనూ.. ఇటు దేశీ స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల్లోనూ ఆధిపత్యంవహిస్తూ వచ్చిన సాఫ్ట్వేర్ రంగం ఇటీవల కొద్ది రోజులుగా గాడి తప్పుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లలో కొద్ది వారాలుగా ఐటీ స్టాక్స్లో అమ్మకాలే అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఫండ్స్ పెట్టుబడుల్లో సాఫ్ట్వేర్ రంగానికి ఉన్న ప్రాధాన్యత మసకబారుతోంది...
సుమారు ఏడాది కాలంగా పలు ప్రతికూలతలతో సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతోంది. ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ నిర్ణయాలలో క్లయింట్ల ఆలస్యం వంటి అంశాలు ప్రాజెక్టులు, డీల్స్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీల ఫలితాలు సైతం నీరసిస్తున్నాయి. ఇదే సమయంలో పులిమీద పుట్రలాగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్సహా గూగుల్(జెమినై), డీప్సీక్, తదితర ఏఐ దిగ్గజాలు మొత్తం ప్రపంచ ఐటీ రంగ ముఖ చిత్రాన్నే మార్చివేస్తున్నాయి.
ఏఐతో అభివృద్ధి చేసిన క్లాడ్ తదితర టూల్స్.. కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ తదితర సంప్రదాయ సర్వీసులను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్సహా పలు టెక్ దిగ్గజాలలో అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాతోపాటు.. మధ్యస్థాయి కంపెనీల స్టాక్స్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని విభాగాలలో ఏఐ సానుకూల ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రా జెక్టులు, ధరలు వంటి కీలక అం శాలలో సవాళ్లు ఎదురుకానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
6.7 శాతానికి డౌన్
ఏఐ ప్రకంపనల నేపథ్యంలో కొద్ది నెలలుగా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఐటీ రంగంలో పెట్టుబడులపట్ల విముఖత చూపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. 2025 ఏప్రిల్తో పోలిస్తే మొత్తం ఈక్విటీ రంగంలో ఫండ్స్ పెట్టుబడులు 1.8 శాతం క్షీణించాయి. 2026 ఏప్రిల్కల్లా ఐటీ రంగంలో ఎంఎఫ్ల పోర్ట్ఫోలియో 8ఏళ్ల కనిష్టానికి చేరినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదికలో పేర్కొంది.
నిజానికి గత 18 నెలలుగా ఐటీ స్టాక్స్ నీరసిస్తూ వస్తున్నాయి. 2024 డిసెంబర్లో నమోదైన గరిష్టం నుంచి చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 36% పతనమైంది. దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితరాల ఫలితాలు ఆకట్టుకోకపోగా.. భవిష్యత్ అంచనాలు(గైడెన్స్) ఆసక్తిని కలిగించకపోవడం దీనికి కారణమవుతోంది. నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వివరాల ప్రకారం మిరాయ్, హెచ్డీఎఫ్సీ, కొటక్ తదితర ఫండ్స్ పెట్టుబడులను తగ్గించుకోగా.. ఆదిత్య బిర్లా ఎస్ఎల్, ఐసీఐసీఐ ప్రు తదితరాలు హోల్డింగ్స్ పెంచుకున్నాయి.
కారణాలున్నాయ్..
మూడు నెలలక్రితం పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ధరలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొన్ని దేశాల మిలటరీ వ్యయాలను పెంచింది. ఈ నేపథ్యంలో పలు దేశాల రిజర్వ్ బ్యాంకుల పరప తి విధానాలు ప్రభావితంకానున్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలకు సైతం సవాళ్లు ఎదురుకానున్నాయన్న భయాలు పెరుగుతున్నాయి.
మరోపక్క ఇటీవల వేగంగా దూసుకువస్తున్న ఏఐ సేవలు ఐటీ ప్రాజెక్టుల రూపురేఖలను మార్చివేయడంతోపాటు ఉపాధి అవకాశాలపైనా తీవ్ర ప్రభావం చూపనున్న అంచనాలు వీటికి జత కలిశాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం కలవరపడుతోంది. అయితే ఇదే సమయంలో విప్లవాత్మక ఏఐ సేవలకు తెరతీస్తున్న చాట్ జీపీటీ, ఆంత్రోపిక్సహా.. చిప్ దిగ్గజం ఎన్విడియా సంచలనాలు సృష్టిస్తుండటం గమనార్హం! ఈ నేపథ్యంలో ఆంత్రోపిక్, ఎన్విడియా కంపెనీల విలువ రోజురోజుకీ బలపడుతుంటే.. గ్లోబల్ టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్ తదితరాల విలువ వెనకబడుతోంది!! ఇందుకు దేశ, విదేశీ పెట్టుబడుల తీరు ప్రభావం చూపుతోంది!
– సాక్షి, బిజినెస్ డెస్క్


