జడ్పిటిసి, ఎంపిటిసి తొలిదశ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ పద్దతిలో ఈ పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5గంటల వరకు లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 67శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా. కొన్ని జిల్లాలలో 80శాతం వరకు పోలింగ్ జరిగినట్లు అధికారులు చెప్పారు. అక్కడక్కడా చదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల ఓటర్ల జాబితా తారుమారయ్యాయి. ఓటర్లు ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వారివల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజరలో ఎస్ఐ దౌర్జన్యానికి దిగిందిగాక గాలిలోకి కాల్పులు జరిపాడు. మహబూబ్నగర్ జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామంలో జయన్న అనే ఓటర్ను పోలీసులు కొట్టడంతో మనఃస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. పోలింగ్ చివరి దశలో చిత్తూరు జిల్లా పీలేరులో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. తునిలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. పలువురు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గాయపడ్డారు. అనంతపురం జిల్లా చెరువుదొడ్డి గ్రామంలో ఓటర్లు అసలు ఓట్లు వేయలేదు. ఆ గ్రామంలో మొత్తం 362 ఓట్లు ఉన్నాయి. ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది.
Apr 6 2014 5:38 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement