● ఇక్కడ ఇమడడం సాధ్యమేనా? | - | Sakshi
Sakshi News home page

● ఇక్కడ ఇమడడం సాధ్యమేనా?

Mar 9 2026 7:28 AM | Updated on Mar 9 2026 7:28 AM

● ఇక్కడ ఇమడడం సాధ్యమేనా?

సాక్షి ప్రతినిధి, కడప: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మరుక్షణం నుంచే పచ్చ నేతలు బరి తెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలతో ఆటలాడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సేవ చేసే నిజాయితీ అఽధికారులను వేధింపులకు గురిచేస్తున్నారు. డూడూ బసవన్నలకు అగ్రపీఠం వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారులపై వ్యక్తిత్వహణనానికి పాల్పడుతున్నారు. విధి నిర్వహణలో నిజాయితీ, నిక్కచ్చితత్వంతో వ్యవహరిస్తే రాత్రికి రాత్రే బదిలీ బహుమానంగా ఇస్తూ సత్కరిస్తున్నారు. నాయకుల అడ్డదారులకు అడ్డుగా నిలిస్తే పోస్టింగ్‌ పెండింగ్‌ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందుల అర్బన్‌ పోలీసుస్టేషన్‌ సీఐగా శ్రీరామ్‌ను నియమించారు. నిజాయితీ అధికారిగా పేరుగాంచిన శ్రీరామ్‌ను ఇక్కడైనా విధి నిర్వహణకు అడ్డుపడకుండా ఉండగలరా? అనే సందేహాన్ని ప్రజాస్వామ్యవాదులు వ్యక్తం చేస్తున్నారు.

● ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ సీఐగా శ్రీరామ్‌ గత ఏడాది డిసెంబర్‌ 18న బాధ్యతలు చేపట్టారు. ఉద్యోగ నిర్వహణలో తనదైన శైలిలో నిక్కచ్చితత్వంతో వ్యవహరించారు. విధుల్లో చేరగానే రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అడ్డుఅదుపు లేని మద్యం విక్రయాలను కట్టడి చేశారు. అంతే సరిగ్గా 40రోజుల వ్యవధిలో బదిలీ బహుమానంగా దక్కింది. ఆయన చేయనదల్లా అధికార పార్టీ నేతల్ని ప్రసన్నం చేసుకోకపోవడం, పోస్టింగ్‌ రాగానే పూల బొకేలతో క్యూ కట్టకపోవడమే. అంతే తక్కువ కాలంలో బదిలీ ఉత్తర్వులు లభించాయి. మరో 40రోజుల తర్వాత పులివెందుల పోస్టింగ్‌ దక్కింది. సోమవారం బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడైనా ఉద్యోగాన్ని సవ్యంగా కొనసాగిస్తారా? అన్న సందేహాలు లేకపోలేదు.

విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత చాటుకునేవారు కరువు అవుతున్నారా...? అధికారం, అక్రమార్జనకు బానిసలయ్యే అధికారులే అధికమయ్యారా...? ఖద్దరు నేతలు ఆదేశిస్తే జీ...హుజుర్‌ అంటూ తలాడిస్తూ చెప్పిందే తడువుగా ఖాకీలు పనిచేస్తున్నారా...? ఈ ప్రశ్నలన్నింటికీ విశ్లేషకులు అవుననే సమాధానమే ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పులివెందులలో సీఐ శ్రీరామ్‌ ఇమడడం సాధ్యమేనా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. టీడీపీ నేతల వ్యవసాయ తోటలో జూదం ఆడుతున్నారని తెలుసుకున్న ఓ ఎస్‌ఐ జూదగృహంపై దాడి చేశారు. జూదరుల సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అదే జూదరులంతా సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో కూర్చొని ప్రశ్నిస్తుంటే ఎస్‌ఐ నిల్చోని సమాధానం చెప్పాల్సిన దుస్థితి నెలకొంది. తర్వాత వారం రోజులు తిరక్కముందే అక్కడి నుంచి సదరు ఎస్‌ఐకి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. పులివెందులలో వైఎస్సార్‌ విగ్రహానికి ఉన్న టీడీపీ జెండాలు తొలగించిన నేరానికి మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌తోపాటు పలువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇలాంటి ఏకపక్ష చర్యలకు వత్తాసుగా నిలిచే వారే అక్కడ విధి నిర్వహణలో ఆటంకాలు లేకుండా ఉండగల్గుతున్నారు. ఈ పరిస్థితులల్లో సీఐ శ్రీరామ్‌ పులివెందులలో చట్టానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, నిజాయితీగా నిబద్ధతతో పనిచేయగలరా? అన్న సందేహాలను పలువురు వ్యక్త పరుస్తున్నారు. పులివెందుల సబ్‌ డివిజన్‌లో టీడీపీ నేతలు పోలీసు అధికారులను పరుషంగా మాట్లాడినా సర్దుకుపోవాల్సిన పరిస్థితులున్నాయి. తెలుగుతమ్ముళ్లు అనువైన ప్రాంతాలల్లో జూదం కట్టడి చేయడం ఏమాత్రం నచ్చడం లేదు. పరిస్థితులను పరిశీలిస్తే అక్కడ ఖాకీలపై ఖద్దరు స్వారీ చేస్తోంది. ఇప్పటికే 32 సార్లు బదిలీ ఉత్తర్వులందుకున్న సీఐ శ్రీరామ్‌ పులివెందుల నియామకం ఆసక్తిగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఖద్దరు అవినీతిని.. అక్రమాలను అరికట్టడానికి సీఐ శ్రీరామ్‌ ఎలాంటి బాణాలు సంధిస్తారో వేచి చూడాలి.

పులివెందుల సీఐగా బాధ్యతలు చేపట్టనున్న సీఐ శ్రీరాం

ప్రొద్దుటూరులో 40 రోజులకేబదిలీ ఉత్తర్వులు

తక్కువ రోజుల్లోనేఅసాంఘిక శక్తుల్లో వణుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement