
● శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ రాష్ట్రాల్లో మే, జూన్ నెలల్లోనే వర్షాలు బాగా కురవడంతో కృష్ణా, తుంగభద్ర ద్వారా వరద ప్రభావం శ్రీశైలం జలాశయానికి భారీగానే వస్తోంది. శ్రీశైల జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను ఆదివారం నాటికి 869.8 అడుగులకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుత స్టోరేజీ 140.65 టీఎంసీ (65.17 శాతం)లకు చేరింది. ఫ్లడ్ కుషన్ 75.16 టీఎంసీలుగా నమోదైంది. ఇక డ్యాంలోకి 1,35,100 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గత 20 ఏళ్ల నుంచి ఇంత సానుకూల పరిస్థితి ఎన్నడూ లేదని అంటున్నారు. ప్రభుత్వం కూడా నీటిని దిగువకు విడుదల చేయకుండా నిల్వ ఉంచడం వల్ల నీటిమట్టం పెరుగుతోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే వారం లేదా పది రోజుల్లోనే డ్యాం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నీటిని కేసీ కెనాల్కు విడుదల చేయాలని ఆయకట్టు రైతాంగం కోరుతోంది. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మొత్తం కేసీ కింద 2.65 లక్షల ఎకరాలు ఉంది. ఇందులో వైఎస్సార్ కడపజిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది ఆగస్టులో సాగునీరు విడుదల చేసేవారు. ఇప్పుడు ముందుగానే శ్రీశైలంలో ఎండీడీఎల్కు మించి నీటిమట్టం చేరుకుంది. కాబట్టి జులై ప్రథమార్థంలోనే నీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నీటి ప్రకటన చేస్తే నారు నారుమడులు సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఖరీఫ్ ప్రారంభంలోనే పంటల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద గణనీయంగా తగ్గుతుందని, దిగుబడి బాగా ఉంటుందని రైతులు అంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, సాగునీటి సంఘాల నేతలు చెరువుల్లో మట్టిని అమ్ముకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు తప్ప కేసీ నీటి విడుదల విషయం ఆలోచించడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నీటి విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.